Thursday 1 February 2024

నైమిశారణ్యం -2 (03-Feb-24, Enlightenment Story)

 *నైమిశారణ్యం (Naimisha Forest) :*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

 *శ్రీరాముడు :*

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.



*పరిక్రమణ :*
నైమిశారణ్యంలో 84 క్రోసుల పరిక్రమణ అనేదొకటి అని విశ్వసిస్తుంటారు. ఫల్గుణమాసంలో ఈ పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిశారణ్యంలో మొదలుపెట్టి, 11 పవిత్ర క్షేత్రాలలో మజీలీలు చేసుకుంటూ, మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ముగుస్తారు.

*చూడవలసిన ప్రదేశాలు :*
వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.
గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్‌ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది. నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్‌. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి. శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.

*ఆలయాలు :*
వ్యాసగద్దె, సూతగద్దె, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, మొదలైనవి ఉన్నాయి.రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉంది.

*భూతేశ్వరాలయం :*
చక్రతీర్థానికి పక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయం అంటారు. ఈ ఆలయం పుట్టుకకి ఒక గాథ ఉంది. గయుడు అనే రాక్షసుడు విష్ణుధ్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేసాడు. కానీ విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అను గ్రహిస్తానన్నాడు. దానికి గయు డు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసు కుంటుంటే, నిన్నెవడు రమ్మన్నాడు. నీవు నాకు వరమిచ్చే వాడివా! నేనే నీకు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడి అహంభావా నికి శ్రీహరి మనసులో నవ్వుకుని, అయితే సరే గయుడు నా చేతిలో మరణించేటట్టు వరం ఇవ్వ మని అడిగాడు. ఇక మాట తప్పలేక గయుడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేసాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుని మూడు భాగాలుగా నరికేసాడు. అందులో ఒక భాగం గయలో పడగా, రెండవ భాగం నైమిశారణ్యంలోనే పడింది. మూడవ భాగం బదరీనాథ్‌లో పడింది. ఈ మూడు ప్రసిద ్ధక్షేత్రాలుగా వెలిసాయి. ఈ నైమిశారణ్యంలో పడిన చోట ఆలయ నిర్మాణం జరిగింది. అందులో వేలుపుని భూతేశ్వరుడు అని వ్యవహరిస్తారు.

*చక్రతీర్థం :*
భూతేశ్వరాలయానికి ప్రక్కనున్న సరస్సే చక్రతీర్థం అంటారు. ఇది వృత్తా కారంలో ఉండి చుట్టూ మెట్లుండి స్నానమాచ రించడానికి అనువుగా ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనేక రుగ్మ తలు నయమవుతాయని ప్రజల విశ్వాసం.

*వ్యాసగద్ది :*
ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాసమహా ముని నివసించిన ప్రదేశం ఉంది. దీనినే వ్యాసగద్ది అంటారు. ఈ కాలంలో గోమతీ నదిని ధ్యానమతి గంగ అని కూడా పిలిచేవారు. ఈ ప్రదేశంలో ఒక పీఠంలాంటి గద్దెపై పట్టువస్త్రంతో అలంక రించి ఉంచారు. ఆనాడు వేద వ్యాసుడు ఇక్కడ కూర్చుని మహా భారతాన్ని చెప్తుంటే, విఘ్నేశ్వరుడు ప్రక్కన కూర్చుని రాసిన పవిత్ర స్థలం ఇదే. ఈ పక్కనే వ్యాసుని కుమారు డైన శుకమహర్షి పాల రాతి విగ్రహం, కొద్ది దూరంలో పరీక్షితు మహారాజు, శుకమహర్షి శిష్యుడైన శ్యాం చరణ్‌ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి.

ప్రాచీన కాలంలో గోమతిని ధ్యానమతి గంగ అనేవారట. ఇక్కడ నిలుచుని చూస్తే, ఒకపక్క ప్రవహించే గోమతి, మూడు పక్కలా దట్టంగా వ్యాపించిన అరణ్యంతో మనోహరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఇక్కడ చిన్న మందిరాన్ని నిర్మించారు. ముందున్న యజ్ఞశాలలో ఇప్పటికీ యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. వచ్చినవారు యజ్ఞవాటికకు ప్రదక్షిణ చేసి అందులోవున్న భస్మాన్ని నుదుట ధరించి వ్యాసగద్ది దర్శిస్తారు.

*లలితాదేవి ఆలయం :*
ఈ నైమిశారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి. పాలరాతి తోరణాలు, విశాలమైన మండపం ఉండి నిత్య జనసందోహాలతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ వుంటుంది.

*హనుమాన్‌ ఘరి :*
ఈ మందిర విశేషానికి వస్తే, రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహ రించుకుపోయాకా, ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలు వెత్తులో ఉండి, భుజాలమీద రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని కాలికింద తొక్క బడుతూ మైరావణుడు ఉంటారు. అంజనేయ స్వామి నిత్యపూజలతో, భక్తులతో నిత్యం నయనానందకరంగా ఉంటుంది.

*నైమిశనాథ దేవాలయం :*
ఇక్కడి స్వామి నైమిశారణ్యం క్షేత్రపాలకుడు. వేంకటేశ్వర స్వామిని పోలిన ఆకారంలో ఉంటాడు. నల్లని విగ్రహం బంగారు ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాగే అహౌ బిలం వారు నిర్మించిన నారసింహ దేవాల యం, దదీచి కుండం, బలరాముడు ఇక్కడకి వచ్చిన ప్రదేశం, చూడదగ్గవి. అన్నిటినీ మించి ఇక్కడి రమణీయ దఋశ్యాలు అనేకం మనకి కనువిందు చేస్తాయి.

*పురాణపురుష :*

ఇక్కడ ఆనందమయి మాత ఫౌండేషన్‌ వారు నిర్మించిన పురాణ పురుషుని మందిరం చాలా అందమైన నిర్మాణం. పురాణ పురుషుని విగ్రహం పంచలోహంతో మలచారు. చిలుక తలతో, అభయముద్రలో, ప్రశాంత గంభీర వదనంతో వుంటుంది. ఇక్కడ పురాణాం మీద పరిశోధన జరుగుతోంది. 18 పురాణాల తాళ పత్ర గ్రంథాలు పట్టుబట్టలో చుట్టి ఒక వేదిక మీద ఉంచారు. దీని చుట్టూ రేలింగ్‌ అమర్చి ఒక పక్క వేదవ్యాసుని విగ్రహం ప్రతిష్ఠించారు. మరో పక్క నూతుని విగ్రహముంది. దీనికి ప్రక్కనే బహు విశాలమైన గోష్ఠిమందిరం పెద్ద పెద్ద పట్టుపురుపులతో, గద్దెలతో పవిత్ర వాతావరణం ఆవరించింది ఉంది.

*అహోబిల మందిరం :*
మన అహోబిలమఠం వారిక్కడ నిర్మించిన ఆలయంలో నారసింహుని పంచలోహ విగ్రహం నిత్య పూజలతో అలరారుతోంది.

*దధీచి కుండం :*
ఇది ప్రసిద్ధికెక్కిన స్థలం. దీనికో పౌరాణిక గాథ ఉంది. దేవదానవ యుద్ధాలు తరతరాలుగా జరిగాయని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అలాంటి ఒక యుద్ధంలో తారకాసురుడు విజృంభించి, దేవతలనందరినీ చంపుతున్న తరుణంలో ఇంద్రుడు విష్ణువును సమీపించి దేవతలకు రక్షంచమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి సలహా మేరకు దధీచి మహర్షి ఎముకతో తయారుచేసిన ఆయుధం రాక్షస సంహారం చేయగలదని తెలిపాడు, ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించి జరిగిన విషయం వివరించి ఆయన వెన్నెముకను ఇవ్వమని కోరాడు . ఆ మహాత్ముడు ఈ కోరిక లోక కళ్యాణార్థమని గ్రహించి, యోగమార్గాన తన శరీరాన్ని త్యజించాడట. ఆయన సుదీర్ఘ తపస్సుతో, అనూహ్యశక్తి సంపన్నమైన ఆయన ఎముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారుచేసుకుని విజయం సాధించాడట. యిప్పటికీ ఇదే ఇంద్రుని ఆయుధం. ఈ సంఘటన జరిగిన ప్రదేశంగా ఈ దధీచికుండానికి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. లోకకళ్యాణార్థం, తన శరీరాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగనిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఈ దధీచి కుండం.

*బలరాముని ప్రాయశ్చిత్తం :*
బలరాముని గురించిన పురాణగాధలో బలరాముడు నైమిశారణ్యంలో ప్రాయశ్చితకర్మలు నిర్వహిన్నట్లు తెలుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బలరాముడు తాను తటస్థంగా వుండిపోవాలని నిశ్చయించుకుని, తీర్థయాత్రలకు బయలుదేరి, దానిలో భాగంగా నైవిశారణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాలపై సుదీర్ఘమైన సత్సంగంలో ఉన్నారు. బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు. సభకు ఆచార్యపీఠాన్నలంకరించిన వారు ఇలా లేవకూడదు. కనుక ఆ స్థానంలో వున్న రోమహర్షణుడు (నూతుడు) లేచి నమస్కరించలేదు. ఇది అవిధేయతగా భావించి దీనిని సహించలేని బలరాముడు సూతుని శిరస్సు ఖండించాడు. మునిగణాలలో అహంకారాలు చెలరేగినాయి. ఈ ఉద్విగ్నిత కొంత ఉపశమించిన తరువాత ఈ బ్రహ్మహత్యా పాతకానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు. అప్పటికే పశ్చాత్తాపపడుతున్న బలరాముడు ప్రాయశ్చిత్తమేదో వారినే నిశ్చయింపమన్నాడు. వారు అక్కడ బల్వుడనే రాక్షసుడు మహా భయంకరుడు. అమావాస్య, పౌర్ణమి రోజులలో మా సమావేశాలను భగం చేస్తూ, రక్త మలమూత్రాలు మాపై కురిపిస్తున్నాడు. ముందు వాణ్ణి సంహరించి మాకుపకారం చేయి. తరువాత 12 మాసములు బ్రహ్మవర్తంలోని సకల తీర్థాలు సేవిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తుడవుతావని తెలిపారు. ఇంతలో పౌర్ణమిరానే వచ్చింది. పెద్ద తుఫాను చెలరేగి, చీము, రక్తమూ వర్షిస్తూ నల్లని పర్వతాకారంలో అతి భయంకరంగా బల్వలుడు విజృంభించాడు. బలరాముడు తన ఆయుధాలను స్మరించగనే అతని గద, నాగలి చేతికి వచ్చాయి. బలరాముడు గదతో వాడి తలవ్రక్కలు చేశాడు. వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు. మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు. అప్పుడు బలరాముడు వేద ప్రమాణపరంగా మానవుడు తన ప్రతిరూపంగా పుత్రుడై జన్మిస్తాడు గనుక యికనుండి రోమహర్షుని తనయుడు మీకు పురాణ ప్రవచనం చేస్తాడు. అతనికి దీర్ఘాయువు, బలము ఇంద్రియపటుత్వము ప్రసాదిస్తున్నానని అన్నాడట. మునులందరూ అంగీకరించి అతణ్ణి వైజయంతి మాలతో సత్కరించి పంపారట.

*వైష్ణవ దివ్యదేశాలు :*
108 వైష్ణవ దివ్యదేశాలలో నైమిశారణ్యం ఒకటి.

*మార్గం :*
లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ. కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్. అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...