Thursday 23 November 2023

మహర్షి శంఖం - నీతి కథలు (01-Dec-23, Enlightenment Story)

 మహర్షి శంఖం - నీతి కథలు

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

అనగనగా ఒకరోజు. మామిడిమల్లి ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు."వజ్రాల హారం వేసుకుని మరీ బయల్దేరారేంటండీ..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా ఏంటీ..?" ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి.

"నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ...? పది వేళ్ళకూ ఉంగరాలు పెట్టుకోలేదూ...? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది" అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి. ఇంతలో మూడో వ్యాపారి కలుగ జేసుకుని.. "డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు, నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు... ఇదంతా సంపద వల్లనే కదా...!!" అంటూ చెప్పుకొచ్చాడు.

"మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే... అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి" మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైనవాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక.. 

మహర్షిని ఆటపట్టించసాగారు."నీ దగ్గర ఏముంది ముసలోడా...?" అన్నాడొక వ్యాపారి.ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ..."నా దగ్గరేముంటుంది నాయనలారా...! అంటూ, జోలె లోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ... ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు" అన్నాడు. "అయినా.. ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే...!" అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు. 


దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు.పడవ అలా నది మధ్యలో సాగుతుండగా... ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి, బలమైన ఈదురుగాలులు వచ్చాయి.

గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను "సాములూ.. అందరూ గట్టి అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు" అని చెప్పాడు.దీంతో... వ్యాపారులంతా పెద్ద పెట్టున... రక్షించండి... రక్షించండి... అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి.. వ్యాపారులను, మహర్షిని కాపాడారు.

బ్రతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ... మహర్షి వద్దకు వచ్చి... "నిన్న ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా.. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం..." అంటూ, అన్యధా భావించకుండా, దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు.అప్పుడు మహర్షి నవ్వుతూ... "నాయనలారా... డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు" అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంటంటే పిల్లలూ... ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

ఈ సమయం వెళ్ళిపోతుంది (30-Nov-23, Enlightenment Story)

ఈ సమయం వెళ్ళిపోతుంది

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

🍁 దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
🍁 సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
🍁 ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు  తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు.

🍁తూట కంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు.సూది పని ఎప్పుడూ జోడించడమే,కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెర లాగా విడదీస్తూ కాదు.
🍁 నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే. నీకు సమష్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని. స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,యోధుడిని యుద్ధంలోను,భార్యను పేదరికంలోను, గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.
🍁చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు,అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,గెలుస్తావు.

🍁ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం,నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు.నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.
🍁స్వయంకృషితో పైకొచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు. ఒక సారి అర్జునుడు ,శ్రీకృష్ణునితో అడిగాడు ఈ గోడ పైన ఒక సందేశం వ్రాయి.అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం కావాలి దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కావాలి. శ్రీ కృష్ణుడు వ్రాశాడు:- ఈ సమయం వెళ్ళిపోతుంది

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

నవవిధ భక్తి మార్గాలు అంటే ఏమి..? అవి ఏవి..? (29-Nov-23, Enlightenment Story)

 నవవిధ భక్తి మార్గాలు అంటే ఏమి..? అవి ఏవి..?

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁🍁

భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది. భక్తి యోగం గురించి భగవద్గీత లో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.

భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది. ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం, ఆ భక్తి చేయడం అనేది కొందరు భజనలు చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.

శ్రీ రామచంద్రుడు ఈ "నవ విధ భక్తి మార్గములు" గురించి లక్ష్మణునికి వివరించినట్లు వాల్మీకి మహాముని వ్రాసారు... అంతే కాక భాగవతం (శ్రీమద్భాగవతం 7.5.23) కూడా ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపునికి ఈ నవ విధ భక్తి మార్గముల గురించి ఈ విధంగా వెల్లడిస్తాడు...

" శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్‌

అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్‌ "












శ్రవణం :ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోనే దైవత్వమును గ్రహించి కేవలం శ్రవణం ద్వార భక్తితత్వాన్ని గ్రహించాడు. మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలు వినటానికి అది ఏ రూపంలోనైనాసరే (ఇప్పుడు అందరి ఇళ్ళలో సిడి ప్లేయర్స్, టేపిరికార్డ్లు ఉంటున్నాయి కదా) పొద్దున్నే సుప్రభాతం, విష్ణు, లలితా సహస్రనామములు, వారి ఇష్టదేవతా స్తోత్రములు వినడం ద్వారా ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభించడం మంచిది. శ్రవణం (వినడం) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు


కీర్తనం :

మనందరికి తెలిసిన అన్నమ్మయ్య, త్యాగయ్య, భక్త రామదాసు మొదలైన వాగ్గేయకారులంతా భక్తి చేసినది "కీర్తనం" ద్వారానే. అందరికి అష్టోత్రాలు, సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు, వారు అలా బాధపడకుండా, కీర్తనల రూపంలో ఆ శ్రీమన్నారాయణుడిని ఆరాధించవచ్చు. కీర్తనం(పాడడం) చేత నారద మహర్షి తరించాడు


స్మరణం :

కార్తీకపురాణం, విష్ణుపురాణం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మొదలైనవి అన్ని "స్మరణ" మార్గంగా చెప్పవచ్చు. అంజనేయస్వామి కూడ ఎప్పుడూ రామ నామస్మరణలోనే ఉంటాడు. స్మరణం(నోటితో ఎల్లప్పుడు పలకడం) చేత ప్రహ్లదుడు తరించాడు.


పాదసేవ పాదసేవ కంటే మించినదిలేదు. గురువుగారి కి పాదసేవ, పాదపూజ చేయడం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలము. భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు. పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు


అర్చనం : మనం ప్రతినిత్యం చేసే విగ్రహారాధనే అర్చనం. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం. పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు. అర్చణంతో పృధు చక్రవర్తి తరించాడు

వందనం : ఇష్టదైవానికి / గురువుకి మనస్పూర్తిగా నమస్కరించడం. రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు.వందనం చేత అక్రూరుడు తరించాడు. 

సఖ్యం : భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత. కుచేలుడు దీనికి మంచి ఉదాహరణ. గోపాలునితో స్నేహమొనరించి, ఆ స్నేహమాధుర్యంతోనే అనన్యమైన భక్తిని సంపాదించాడు. దాస్య భక్తి (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.

ఆత్మనివేదనం: కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో ఆ దేవదేవుడిని పూజింపాలి.ఆత్మనివేదనంతో బలిచక్రవర్తి తరించారు

దాస్యం : సర్వం ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. లక్ష్మణుడు ప్రతీక్షణం శ్రీరామచంద్రుడికి కావలసినవి అమర్చడం, ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించడం మొదలైనవి దాస్య భక్తిప్రవృతి గా చెప్పవచ్చు.

మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన నామాన్ని స్మరించండి చాలు. పూజచేయడానికి అంత సమయం లేదు అంటున్న ఈ యాంత్రికకాలం లో పైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సంధర్భం అవసరంలేదు. మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన 

మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి. జీవితంలో దైవనామాన్ని నిరంతరం తరించాలి. జీవితంలో నీ అంతఃరాత్మకు లోబడి జీవించి తరించు. జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు. తత్వ విచారణ చేసి జీవించి తరించు. యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకోని తరించు.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Wednesday 22 November 2023

కనబడని ధర్మం (28-Nov-23, Enlightenment Story)

 *కనబడని ధర్మం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

ధర్మం అంటూ ఉంటారు. దానిని ఎవరూ చూడలేదు కదా! ఆ చూడని ధర్మాన్ని ఒప్పుకో అని ఎందుకు నిర్బందిస్తారు?ధర్మం అనేది కనబడకపోయినప్పటికీ దానిని ఆచరించడమే మేలు. ఆచరించకపోతే అనర్థం ఒకపక్షంలో తప్పదు. ఎలా అంటే ఒక ఇద్దరు దారిలో నడుస్తూ ఉన్నారు. వారికి ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టలో పాము ఉందా? లేదా? అని వారిద్దరిలో విమర్శ వచ్చింది. ఒకడన్నాడు దానిలో పాము లేదు అని, ఒకడు పాము ఉంది అన్నాడు.

పాము లేదు అన్నవాడు పుట్టమీద కాలు పెట్టి వెళతాను అన్నాడు. పాము ఉంది అన్నవాడు దానిమీద కాలు పెడితే కాటేస్తుంది ప్రక్కనుంచి వెళతాను అన్నాడు. వీళ్ళిద్దరి వివాదం వింటున్న మూడవ వాడు అయ్యా అక్కడ పాము ఉన్నా లేకపోయినా ప్రక్కనుంచే వెళ్ళడం మంచిది.

ఎందుకంటే అలా వెళ్తే ఎట్టి పరిస్థితిలో నీకు అనర్థం కాదు. అక్కడ నిజంగానే పాము ఉంటే దానిమీద కాలు పెడితే అది నిన్ను కాటేస్తుంది. ప్రక్కనుంచి వెళ్తే అక్కడ పాము ఉన్నా లేకపోయినా నీకేమీ ఇబ్బంది కలుగదు.

అలాగే పరలోకం ఉన్నా లేకపోయినా ధర్మాన్ని ఆచరించావు అంటే  ఏ పక్షంలోనూ ఇబ్బంది కలుగదు. ధర్మాన్ని ఉల్లంఘించిన వాడికి ఆ పరలోకం ఉన్నది అనే గనుక తీర్మానం అయినట్లయితే వాడికి అనర్థం తప్పదు, వాడికి క్లేశం తప్పదు.

!! సందిగ్ధేపి పరే లోకే కర్తవ్యో ధర్మ ఏవ హి! నాస్తి చేన్నాస్తి నో హానిః అస్తి తే నాస్తి కో హతః!!


పరలోకం అనేది ఉన్నదా లేదా అన్న సందేహం ఉన్నా కూడా ధర్మాన్ని ఆచరించే పక్షంలో ఏవిధంగాను ఇబ్బంది అనేటటువంటిది కలుగదు. (సందేహానికి అవకాశం లేదు ఉన్నది అని సిద్ధాంతం చేశాం). కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ధర్మాన్ని ఉల్లంగించడానికి వీలులేదు.

భగవంతుడిని విశ్వసించకుండా ఉండడానికి వీలులేదు. భగవంతుడిని విశ్వసించాల్సిందే, ధర్మాన్ని ఆచరించవలసినదే. దానివల్లనే నీకు శ్రేయస్సు కలుగుతుంది.ఇది మనయొక్క స్వధర్మం

భగవద్గీత 3-35….

||“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ||

|| స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ”

ఈ ‘స్వధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. పరధర్మం జోలికి ఎన్నడూ పోవద్దు!’ అని భగవంతుడు భగవద్గీతలో దేన్నైతే చెప్పాడో దానిని మనం ప్రతి ఒక్కరం జ్ఞాపకం పెట్టుకోవాలి. 

మనయొక్క స్వధర్మాన్ని సర్వదా ఆచరించాలి. పరధర్మం జోలికి ఎన్నడూ పోకూడదు. అలా పోయేవారికి కూడా మనం బుద్ధి చెప్పాలి. భగవంతుడి ఆదేశాన్ని మనం శిరసావహించి ఆచరించాలి.✍️

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

మీరు అదృష్ట వంతులే (27-Nov-23, Enlightenment Story)

*మీరు అదృష్ట వంతులే*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

🍁మీ నాన్న గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్ట వంతులే. కొంతమంది కోట్లు సంపాదిస్తారు. వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా?

🍁మైక్రోసాఫ్టు అధినేత సత్య నాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు. మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?

🍁అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు. వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు. అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.

🍁మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందలకోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారి‌ మొదటి భార్య చనిపోతే ప్రేమతో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీచ్యుతుడై మనస్తాపంతో చనిపోయాడు.

🍁రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతిగా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?

🍁మరియు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జయలలిత గారు కొన్ని వందల కోట్లు సంపాదించారు మరి ఎవరి పాలయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. 

🍁మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును ఆస్తులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు. ఎంత సంతోషంగా ఉన్నాము అన్నది ముఖ్యం

🍁ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది. ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడకూడదు.

🍁ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు. మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.

🍁మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడు‌ మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్టవంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన, ధర్మమార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.

🍁ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.

ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి. ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.

తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు   వెళ్ళి పోయెడినాడు వెంటరాదు

లక్షాధికారైన లవణమన్నమె గాని   మెండు బంగారంబు మింగబోడు.

ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.

మన కోరికలే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరికలతో తృప్తిగా హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.

"సర్వే జనా సుఖినోభవంతు"

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Tuesday 21 November 2023

నాలుగు మమకారాలు (24-Nov-23, Enlightenment Story)

*నాలుగు మమకారాలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

🍁లోకంలో లోభులకు లోటులేదు. లోభి సంపాదనే్ యేయంగా  జీవనం సాగిస్తాను. సంపాదించిన సంపద తరిగిపోతుందేమోనని నిత్యం: చింతిస్తుంటాడు. ఎవరినీ నమ్మడు. లోభికి కీర్తి నశిస్తుందని, ధనమే పావనమని భావించేవారు. దర్మబ్రష్టులవుతారని, లోనికి స్నేహితులందర పంచతంత్రం చెబుతోంది. లోభాన్ని మించిన చెడుగుణం లేదన్నాడు భర్తృహరి.

🍁`అజ్ఞానం వల్ల లోభం, లోభం వల్ల అజ్ఞానం అన్యోన్యాశ్రితాలై పుడుతుంటాయి. లోభం వల్లనే అన్ని దోషాలూ వ్యక్తమవుతాయి. కపటానికి మూడ లోభం, లోభం వల్ల క్రోధం పుడుతుంది. అజ్ఞానం వల్ల మనిషి దుర్దశ పొందుతూ, కష్టాలు అనుభవిస్తూ ఆపదల పాలవుతాడు. కామం, క్రోధం, లోభమోహాలు అజ్ఞానంలో అంత ర్భాగాలే. అజ్ఞానం. లోభం వల్ల కలిగే పరిణామాలు ఒకేరకంగా ఉంటాయి. లోభం పెరిగినకొద్దీ అజ్ఞానం. పెరుగుతుంది. కనుక లోభాన్ని విడిచిపెట్టాలి. లోభాన్ని విడిచిపెట్టినవారికి ఇహపర సుఖాలు అభిస్తాయి' అని అంపశయ్యపై ఉన్న భీష్యుడు ధర్మరాజుకు ఉపదేశించినట్లు మహాభారతం చెబుతోంది.

🍁మెదడున్నంత మాత్రాన మనిషి మేధావి కాలేదు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిరంతర జ్ఞాన సముపార్జన అజ్ఞానాన్ని పారదోలుతుంది. మెదడు ఆపారమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుంది. మనిషికి చలనం. అభివృద్ధి మెదడుతోనే సాధ్యం. గురువుల వద్ద ఏకాగ్రతతో విద్యనభ్యసించిన విద్యావంతులు మంచి చెడులు మధ్య తేడా గుర్తించగలుగుతారు. జ్ఞానులు సర్వజనులను ఆత్మీయులుగా భావించి అందరి క్షేమాన్ని కాంక్షిస్తారు. లోభత్వం జ్ఞానుల దరికి రాదు.

🍁జ్ఞానమార్గంలో నిలకడగా ఉన్నవారు ఈ జగత్తునే విరాట్ పురుషుడిగా దర్శించగలుగుతారు' అని చెప్పారు శ్రీరమణ మహర్షి. అజ్ఞాని పరనిందకు ప్రాముఖ్యమిస్తాడు. పరుషంగా మాట్లాడతాడు. అర్ధంలేని వాదనలతో విసిగిస్తాడు. జ్ఞానులు శాంతస్వభావులై సత్యాన్నే పలుకుతారు. శ్రీధర్మాలను ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తారు. ప్రాణం ఉన్నంతవరకే ఈ మూడు మకారాల ముచ్చటని గ్రహించగలిగిన జ్ఞానులు భగవంతుడు అనుగ్రహించిన 4 మకారాలను సద్వినియోగం చేసుకుంటారు. 

1) శుభప్రదమైన ఆలోచనలు చేస్తూ, 

2) మంగళకరమైన మాటలు మాట్లాడుతూ. 

3) నిత్యం భగవంతుణ్ని ధ్యానిస్తూ, సూచిస్తూ, ఆరాధిస్తూ, 

4( మరణానంతరం నాలుగో మకారమైన మోక్షానికి అర్హత సంపాదిస్తారు

కామ, క్రోధ, లోభాలనే . మూడు నరక ద్వారాలు ఆత్మవినాశనానికి కారణం కనుక వాటిని త్యజించాలని భగవంతుడి గీతోపదేశం.

🍁ధనం తోడున్నంత మాత్రాన వృద్ధాప్యం పలకరించక మానదు. అనారోగ్యం వేధించక వదలదు. సంపద ప్రాణాన్ని నిలపలేదు. ప్రాణం పోయాక తోడురాదు. హితం కోరని లుబ్ధుడి జీవితం వ్యర్ధమేనని పరుల గ్రహించాలి. లుబ్ధత్వం మనిషిని ఏకాకిని చేస్తుంది. | పరోపకారతత్వం మనుషులను ఏకం చేస్తుంది.. సేవాధర్మంతో సమాజ వికాసానికి తోడ్పడే జ్ఞాని ఉన్నతుడు. సర్వప్రాణులను ప్రేమిస్తూ లోక కల్యాణాన్ని కోరుకునే వేదాన్యులనే భగవంతుడు. కరుణిస్తాడు.🙏

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️


చమత్కార శ్లోకము (25-Nov-23, Enlightenment Story)

 *చ మ త్కా ర శ్లో క ము🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు.  ఆ ధనికుడు సంపాదనతో పాటు సంస్కారమున్నవాడు.ఆ బ్రాహ్మడికి కడుపునిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చక్కని పట్టు వస్త్రాలను యిచ్చి ఘనంగా సత్కరించాడు. దానితో బ్రాహ్మణుడు తనకు జరిగిన సత్కారానికి మిగుల సంతోషించి, ఆ ధనవంతుడిని ఆశీర్వదించాలని అనిపించింది.  ఒక ఆశీర్వచన  శ్లోకం ఇలా చెప్పాడు. 

శ్లోకం.

విహంగో వాహనం యేషాం,   త్రికంచధరపాణయః,    పాసాల సహితా దేవాః,  సదాతిష్ఠన్తు తే గృహే,

భావము.

పక్షులు వాహనాలుగా కలవారునూ, త్రికములను ధరించిన వారునూ, పాసాల తో నిండిన వారునూ, అగు దేవతలు మీ యింట ఎప్పుడూ ఉందురు గాక! ఇదేమి ఆశీర్వచనం అనుకుంటే పొరపాటే... దీని అర్థం ఇలా ఉంది...

వి అంటే పక్షి,

హం అంటే హంస,

గో అంటే ఎద్దు,

పక్షి వాహనంగా కలవాడు విష్ణువు. హంస వాహనుడు బ్రహ్మ. ఎద్దు వాగాహనం గలవాడు శివుడు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ...

త్రికంచ అనగా...

త్రికం ను ధరించినవారు.

త్రి అంటే త్రిశూలం.*

కం అంటే శంఖము.*

అంటే చక్రములను ధరించినవారు

త్రిమూర్తులు, త్రిశూల ధారి శివుడు. శంఖ ధారి బ్రహ్మ.సుదర్శన ధారి విష్ణువు.ఈ ముగ్గురూ పాసాలతో కూడిన దేవతలు.

పా అంటే పార్వతి.*

అంటే సరస్వతి.*

అంటే లక్ష్మీ దేవి.

పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు మీ యింట ఎల్లప్పుడూ వుందురుగాక!  అని అర్థము. సరస్వతి, లక్ష్మీ, పార్వతులనడంలో విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు మీ యింట వుండాలి అని అర్థం.

శంఖ, చక్ర, త్రిశూలములు ధరించిన వారు అనడం వలన శత్రు బాధలు, రాక్షస బాధలు, మీకు వుండవు అని భావము. త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట వుందురు గాక! అనటం తో సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు, శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక!  అని అంత గొప్ప ఆశీర్వచనం ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు.

చమత్కారమైన ఆశీర్వాదము



☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

భక్తి ఒక్కటే ప్రధానం! (26-Nov-23, Enlightenment Story)

భక్తి ఒక్కటే ప్రధానం!

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
అకామః సర్వకామోవా మోక్షకామ ఉదారధీః
తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరమ్‌
-శ్రీమద్భాగవతమ్‌

భక్తి ఒక్కటే ప్రధానం!

‘బుద్ధిమంతుడైన వాడు.. కోరికలు లేనివాడైనా, అన్ని కోరికలు కలవాడైనా లేదా మోక్షాన్ని కోరుకొనేవాడైనా తీవ్రమైన భక్తియోగంతో పరమ పురుషుని (పరమాత్మ) ఆరాధించాలి’ అన్నది ‘భాగవత పురాణం’. గత యుగాల (కృత, త్రేత, ద్వాపర)లో మోక్షానికి జ్ఞాన, వైరాగ్యాలు సాధనాలుగా చెప్పబడినా, కలియుగంలో మాత్రం ‘కేవల భక్తియే’ మోక్షానికి ప్రధానమని చెప్పబడింది. ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసి’, ‘సాతు అస్మిన్‌ పరమ ప్రేమరూపా’. మోక్షసాధనా సామగ్రులలో భక్తియే శ్రేష్ఠమైంది. ‘పరమాత్మపైగల పరమ ప్రేమయే భక్తి’ అన్నాయి ‘నారద భక్తి సూత్రాలు’. ‘ఈ జగత్తు అంతా భగవంతుని అధీనంలో ఉంది. జీవుడు భగవంతునిచేత ఆడించబడే ఒక ఆటబొమ్మ. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అతని లీలలు, గుణాలు, కథలను వింటూ, కీర్తిస్తూ, పరమాత్మ కోసమే కర్మలు చేస్తూ, సాధువులు, సత్పురుషులను సేవిస్తూ, పరమాత్మపట్లనే అనురాగాన్ని కలిగి ఉండటమే భక్తి’.

భౌతిక సుఖాలతోపాటు అనేక వికారాలను పొందే ఈ శరీరం, సంపదలు అన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. ఒక్క పరమాత్మ మాత్రమే శాశ్వతం. ‘పరమాత్మ కూడా తానే’ అన్న సత్యాన్ని తెలుసుకొనే గొప్ప అవకాశం మానవజన్మలోనే సాధ్యం. దీన్ని గ్రహించి, ప్రతి ఒక్కరూ పరమాత్మ పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తన క్షేమం (మోక్షం) కోసం శరీరం నశించేలోపే ప్రయత్నించాలి. అందుకోసమే భగవంతుడిని ఆశ్రయించాలి. పరమాత్మను చేరడానికి భక్తి ఒక్కటే సులభ సాధనం. లభించిన సంపదలు భగవంతుని అనుగ్రహంగా భావించి వాటిని లోకోపకారానికి వినియోగించాలి. పరమాత్మపైనే భక్తి విశ్వాసాలను ఎల్లవేళలా కలిగి ఉండాలి. సంకల్పాలు లేకుండటం వల్ల కోరికలను, కోరికలను వదిలిపెట్టడం ద్వారా కోపాన్ని, ‘ధనమే అన్ని అనర్థాలకు కారణమని’ తెలుసుకోవడం వల్ల లోభాన్ని, ఆత్మ- అనాత్మ విచారంతో శోకమోహాలను, దయను కలిగి ఉండటం వల్ల దుఃఖాన్ని, సాత్విక ఆహారంతో నిద్రను, తత్త విచారంతో భయాన్ని, ప్రాణాయామాదులతో శరీర దుఃఖాలను జయించాలి. సత్సాంగత్యంతో జ్ఞానాన్ని పొంది, వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి. దీన్ని ‘భాగవత ధర్మం’ ప్రబోధిస్తున్నది.

విషయ వాసనల పట్ల ఆసక్తిగలవారు వాటిలోనే చిక్కుపడతారు. పరమాత్మపట్లనే లగ్నమైన మనస్సు గలవారు ఆయననే చేరుకుంటారు. ఇలా అన్నిటిపట్లా ‘ఏకాత్మ భావన’ను కలిగి ఉండటమే జ్ఞానం. విషయ సుఖాలను త్యజించడమే వైరాగ్యం. భగవంతుని పట్ల భక్తిని కలిగించేదే ధర్మం. ‘మరొక భావన లేకుండా ఎప్పుడూ నాపైనే చిత్తం నిలిపి, నన్నే స్మరించేవారికి నేను సులభంగా లభిస్తాను. అలాంటివారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను’ అని ‘భగవద్గీత’లో పరమాత్మనే స్వయంగా ప్రకటించాడు. ఇంతటి అనన్య భక్తి భావనయే మనలను పరమాత్మ అనుగ్రహం పొందేలా చేస్తుంది. ప్రహ్లాదుడు, ధృవుడు, అంబరీషుడు వంటి మహా భక్తులెందరో మనకు ఆదర్శం. మనలోనే కాదు, సర్వజీవులలోనూ భగవంతుడినే దర్శిస్తూ, సమస్త జీవులను భగవంతునిలోనే చూడగలవారే నిజమైన భక్తులు. ‘అహంకార మమకారాలు, రాగద్వేషాలు లేనివారు, ప్రేమ, కరుణ, సమభావం వంటి సద్గుణాలు, పరమాత్మపట్ల దృఢ నిశ్చయం గలవారే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు’ అని ‘భగవద్గీత’ ఉద్ఘాటించింది. ‘అగ్నిలో కరిగే బంగారం మాలిన్యాలన్నిటినీ తొలగించుకొని తన నిజ స్వరూపాన్ని పొందినట్లు’ జీవుడు కూడా పరమాత్మపట్ల అనన్య భక్తితో కర్మ వాసనలను తొలగించుకోవడం ద్వారా పరమాత్మను చేరగలడు. అందువల్ల అనన్య భక్తియే సర్వశ్రేయస్కరం 

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

దేహం ఒక రథం, ఆత్మ రథ సారథి (23-Nov-23, Enlightenment Story)

 దేహం ఒక రథం, ఆత్మ రథ సారథి

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఒక కారు ఉంది, ఇంజను కండిషన్‌లో ఉంది. వీల్స్‌, స్టీరింగ్‌, బ్రేకు, గేర్స్‌ అన్నీ బాగున్నాయి. కొంత దూరం ఆ కారు నడిపి డ్రైవర్‌ దిగి వెళ్లిపోయాడనుకుందాం. కారును అతను ఎక్కడ వదలి వెళ్లాడో అక్కడే ఉంటుంది. అంగుళం కూడా అటూఇటూ కదలదు. ఎందువల్ల?   దానిని నడిపే డ్రైవరు దిగిపోయినందువల్ల.

అట్లే మానవదేహం కూడా. ఈదేహం ఆ కారువంటిదైతే, దీనిని కదిలించే చైతన్యం డ్రైవరు వంటివాడు. చైతన్యం శరీరం నుంచి వెడలిపోతే డ్రైవరు కారు దిగిపోయినట్లే. అయితే ప్రాకృతికంగా కారులో మరో డ్రైవరు ఎక్కి నడిపించవచ్చు. కాని భగవంతుడిచ్చిన ఈ దేహంలో మరో డ్రైవరు ఆ స్థానాన్ని ఆక్రమించ వీలులేదు.

ఆత్మ, దైవశక్తి లేక చైతన్యము ఉన్నంత వరకే మనదేహానికి విలువ. ఆ తదుపరి అంతకన్న పనికిరాని వస్తువు మరొకటిలేదు.

మన కళ్లు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, కాళ్లూచేతులు చలనాత్మకంగా ఉన్నాయి. చెవులు వింటున్నాయి, మనస్సు ఆలోచనలను రేకెత్తిస్తున్నది. ఈ పనులన్నింటినీ మన దేహమే చేస్తున్నదనుకుంటాం. కానీ, కాదు దేహంలో గల చైతన్య శక్తి శరీరావయవాలచే, అంగాలచే, ఇంద్రియాలచే ఆ విధంగా పని చేయిస్తున్నది.


దేహం నుండి ఆ చైతన్యం వెళ్లిపోయిన మరుక్షణం చలనశీలమైన దేహం నేలకూలుతుంది. చలనరహితమవుతుంది. దేహంలోని ఏ అవయవమూ పనిచేయదు. అప్పటి వరకు ‘ఫలానా’ వారు అని పిలువబడిన, గౌరవింపబడిన దేహం ‘ఫలానా’ వారి పార్థివ దేహమవుతుంది. శవంగా మారుతుంది. అంత్యక్రియలకు సిద్దం అవుతుంది. శాశ్వతంగా ఈ లోకంనుండి కనుమరుగవుతుంది. ఆ క్షణం వరకు శరీరాన్ని లోనుండి పనిచేయించిన చైతన్యమే భగవంతుడు.

!!! దేహం ఒక రథం !!!  ఆత్మ రథ సారథి !!!

ఆ చైతన్యాన్నే ‘ఆత్మ’ అని కూడా అంటాం. ఆత్మానాం రథినం విద్ధి, శరీరం రథమేవ తు’ అంటుంది కఠోపనిషత్‌.

ఈ ధర్మసూక్ష్మాన్ని అవగాహన చేసుకొని గాఢంగా విశ్వసించగల్గితే దేవుని దర్శనార్థం అక్కడకు ఇక్కడకు పోనవసరం లేదు. గుళ్లు గోపురాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం అంతగా ఉండదు. ఈ భావన స్థిరపడినపుడు ఎవరూ మనకు పరాయి వారు కాదు. అందరూ దైవస్వరూపులే.

మానవదేహం కదలాడే దేవాలయం వంటిది. ప్రతి దేవాలయంలో దైవ ప్రతిమ ప్రతిష్ఠింపబడి ఉన్నట్లుగా, ప్రతీ దేహంలో చైతన్య స్వరూపంగా ఆత్మతత్వం వ్యాపించియుంటుంది.

అందుకే ఎవరిని గౌరవించినా, ఆదరించినా భగవంతుని గౌరవించినట్లే. ఎవరిని కించపరచినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా భగవంతునికి అపరాధం గావించినట్లే. ఒక్క మానవ దేహంలో మాత్రమేగాదు... ఈ భూమిపై ఉన్న 84లక్షల జీవరాశుల్లోను భగవత్‌ చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది.

ఒక చిన్న చీమను పరిశీలించండి. ఏదో పెద్దపని ఉన్నట్లు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటుంది. ఆ చిన్న చీమలోనున్న ఆ కదలాడే శక్తి ఆత్మతత్వమే. దేవుడెక్కడనుచు దేవులాడగనేల దేవుడుండు తనదు దేహమందె, దేవుడే తానయ్యు,దేవుని వెదకుట, తన్నుతా వెదకునట్లుగాదె!’

కాబట్టి మనలో ఉన్న ఆత్మ అనే దేవుడిని తెలుసుకోవడానికి ‘ధ్యాన సాధన’ చేయాలి. నేను ఎవ్వరు? అని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని రమణ మహర్షి చెప్పేవారు. నిన్ను నీవు తెలుసుకున్నపుడు అంతా నీకు అర్థం అవుతుంది అని రమణ మహర్షి భోధించేవారు.

’అహం బ్రహ్మాస్మి’ అంటే నేను దేవుడిని.  ’తత్వమసి’ అంటే నువ్వు కూడా దేవుడివే. "సర్వం ఖల్విదం బ్రహ్మ’  అంటే మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నాడు.

ఇదే వేదాలు మరియు ఉపనిషత్తుల సారాంశం!  యోగులు యోగ దృష్టి తో చెప్పినవి కూడా ఇదే.

!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు !!   లోకా సమస్తా సుఖినోభవన్తు!!

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

దేవుడు మెచ్చిన 8 పూలు (22-Nov-23, Enlightenment Story)

 *దేవుడు మెచ్చిన పూలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

🍁మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. 

ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని

సగుణోపాసన - దైవాన్ని ఓ విగ్రహంలోనో, పటంలోనో, శిలలోనో చూసుకుంటూ, అదే నమ్మకంతో పూలు, ధూపదీప నైవేద్య, తాంబూలాదులతో అర్చించడం సగుణోపాసన, పేరు.. రూపం మొదలైనవి ఏవీ లేవని, 

నిర్గుణోపాసన - స్వామి నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడని ఆత్మజ్ఞానంతో, ధ్యానంతోఉపాసించడమనేది నిర్గుణోపాసన

🍁కొద్దికాలమే ఉండి, తరవాత వాడి, వాసన కోల్పోయి, నిర్మాల్యంగా మిగిలిపోయే ఈ పూలకంటే నిజంగా దైవం మెచ్చిన పూలు వేరే ఉన్నాయి. అవి అంతర్యామికి అర్పించుకోవడమే అసలైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు.

🍁పరమాత్మకు అందించవలసిన ప్రథమపుష్పం అహింస. మనం అహింసా ధర్మం పాటిస్తే ఆ పుష్పంతో పరంధాముణ్ని పూజించినట్లే. లోకంలో దీన్ని మించిన ధర్మం లేదు కనుక దీన్ని పరమధర్మం అన్నారు. శారీరకంగా సాటివారిని హింసించడం శారీరక హింస. మానసికంగా హింసించడం మానసిక హింస. ఈ రెండూ మనిషికి కూడనివి.

🍁రెండో కుసుమం- ఇంద్రియ సంయమనం. మనిషి ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే పాపాలు చేయడు. నేడు ముఖ్యంగా సంయమన లోపం వల్లనే సమాజంలో ఎన్నో దుష్కృతాలు జరుగుతున్నాయి. దోపిడీళ్లు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మనోనియంత్రణ ఉంటే ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకు తగ్గుతాయి.

🍁మూడోది దయాపుష్పం. సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కుంది. 'బతుకు, బతకనివ్వు' అన్నారు అందుకే! సమాజం ఎంతోమంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పీడితులు, క్షుద్బాధతో అలమటిస్తున్నవారున్నారు. వారిపట్ల దయ చూపించడమే కాక, ఆదుకుని చేయి అందించడం మన ధర్మం. ఈ దయా ప్రసూనాన్నే దేవుడు స్వీకరిస్తాడు.

🍁మరో పుష్పం - క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, సహనం. క్షమ అనేది మనిషికి పెట్టని ఆభరణం. క్షమ వల్ల ఖ్యాతి లభిస్తుంది. గౌరవం, అధికారం, అభిమానం సహనం వల్లనే లబిస్తాయి.

🍁ఆశ్రితవత్సలుడు మెచ్చే మరో అపురూప ప్రసూనం- శాంతి. ఎన్ని కష్టాలు పడ్డా తుకారాం, మీరాబాయి శాంతిని విడనాడలేదు.

🍁తపఃపుష్పం దేవుడు మెచ్చే మరో పుష్పం. అడవుల్లో చేసేదే తపస్సు కాదు. నిరంతరం త్రికరణ శుద్ధిగా దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావడమూ తపస్సే. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, తమ విధులనే నిధులుగా భావించేవారిని భగవంతుడు ఇష్టపడతాడు.

🍁మరో పుష్పం ధ్యాన పుష్పం. శ్వాసపైన ధ్యాస ఉంచి, అహం బ్రహ్మాస్మి అనుకోగల పరిణతి పొందడమే ధ్యాన పుష్పం.

🍁చివరి పుష్పం సత్యం. విశ్వమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది. సత్యం నిత్యమైనది. శాశ్వతమైనది. సత్యమే దైవమన్నారు.

🍁ఈ అష్టగుణ సుమాలతో చేసే ఆరాధనే తన కిష్టమన్నాడు ఆపద్బాంధవుడు.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Saturday 18 November 2023

నేనెవరు? (21-Nov-23, Enlightenment Story)

 *నేనెవరు? *

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 .

ఒకసారి ఒక కుందేలు క్యారెట్లు కొరుక్కుంటూ పోతూంటే దానికో ధర్మ సందేహం కలిగింది. "నేనెవరు?" అని. అది పోయి వాళ్ల అమ్మను అడిగింది: "అమ్మా! నేనెవరు?" అని. "నువ్వు నా బిడ్డవు నాన్నా" అన్నది ఆ తల్లి. కానీ కుందేలు పిల్లకి అది పూర్తి జవాబు కాదనిపించింది.

అందుకని అది పోయి తన స్నేహితుడైన అడవి పిల్లిని అడిగింది: "సరేగానీ ఒరేయ్, నీకు పంది కొక్కుల్ని ఎలా వేటాడాలో తెలుసా? నాకు నిన్ననే నేర్పాడు మా నాన్న!" అన్నది అడవిపిల్లి ఉత్సాహంగా. దానికి తనెవరో తెలుసుకుందామని బొత్తిగా లేదు మరి!

కుందేలు పిల్లకు నిస్పృహ కలిగింది. అది నిరాశగా తల వంచుకొని పోతూంటే దానికో కోయిల ఎదురైంది- పాటలు పాడుకుంటూ. "నేనెవరు?" అని కుందేలు అడిగితే అది సంతోషంగా కూసింది. "నువ్వే నేను, నేనే నువ్వు! నిన్ను నువ్వు నేనంటే, నేను నిన్ను నిన్నంటా" అని పాడుతూ ఉత్సాహపడిందది.

కుందేలుకి ఆ పాట విని నవ్వైతే వచ్చింది కానీ, తన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.

ఆ పైన దానికి ఓ నెమలి ఎదురైంది. వాన గాలి చల్లగా వీస్తూంటే, దూరం నుండి తియ్యగా మట్టి వాసనని మోసుకొస్తుంటే ఆగలేక, అది నాట్యం మొదలెట్టింది. ముఖం చిన్నగా చేసుకొని కుందేలు `నేనెవరు?' అని అడిగింది దాన్ని. నెమలి నవ్వింది. "అరే, ఇది ఆలోచించే సమయం కాదురా, ఆనందించాల్సిన సమయం! చూడు చుట్టూతా, ప్రకృతి ఎంత బాగుందో!? ఇలాంటి సమయం ఎప్పుడూ ఉండదు. సంతోషపు ఘడియల్ని ఆలోచనల్తో వృధా చేసుకోవద్దమ్మా, నాట్యంచెయ్ నవ్వుతూ! దా, కావాలంటే నీకు నేను నాట్యం నేర్పిస్తాను!" అన్నది నెమలి, నాట్యం ఆపకుండానే.

కుందేలు చికాకు పడి, `వీళ్లను కాదు, అడగాల్సింది!' అనుకున్నది. "నీళ్లలో నిలబడి నిశ్చలంగా తపస్సు చేసుకొనే కొంగే ఈ ప్రశ్నకు జవాబివ్వగలిగేది." అలా అనుకుని, అది కొంగను వెతుక్కుంటూ పోయింది. అనుకున్నట్టుగానే కొంగ నీళ్లల్లో నిలబడి కనిపించింది దానికి. చాలా సార్లు పిలిస్తే కానీ దాని ఏకాగ్రత తెగలేదు. అప్పుడు కూడా అది కుందేలుకేసి ఓ సారి అలా చూసి, మళ్లీ నీళ్లలోకి చూడటం మొదలుపెట్టింది. కుందేలు చాలాసార్లు అడిగిన తరువాత, అది అన్నది మెల్లగా - "చూడు నాయనా, మనందరం చేపలమే. ఎటొచ్చీ అవి నీళ్లల్లో ఉంటాయి. మనం మాత్రం గాలిలో ఉంటాం. అవి నీళ్లలో తిరుగుతై, మనం గాలిలోనూ, నేలమీదా తిరుగుతాం" అని.

కుందేలుకు ఆ సమాధానమూ తృప్తినివ్వలేదు.

చివరికి అది ఓ ఋషి ఆశ్రమానికి చేరింది. అక్కడ ఋషి కూర్చొని ఏవో ధర్మ గ్రంథాలు చదువుకుంటున్నాడు. "నేనెవరు స్వామీ" అడిగింది కుందేలు చేతులు జోడిస్తూ. "అది కనుక్కునేందుకే నేను ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నానమ్మా కుందేలూ! నాకు ఇంకా ఈ జీవితం ఏంటో అర్థం కాలేదు" అన్నాడు ఋషి, విచారంగా.

అయితే కుందేలు సంతోషంగా ఎగిరి, నమస్కారాలు పెట్టి, ఉత్సాహంగా ఇంటి వైపుకు పరుగులు తీసింది. దానికి అర్థమైపోయింది- తను వేరెవరో కాదు, తను కుందేలు!" అని. అడవి మూల నుండి మరికొన్ని క్యారెట్లు పెరుక్కొని తింటూ అది ఉత్సాహంగా అనుకున్నది మళ్లీ మళ్లీ - "నేను కుందేలును! నేను కుందేలును!" అని.ఒక అన్వేషణగా సాగి, పేరు మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడంతో ముగుస్తుంది 

మానవుని కథాఅంతే, లౌకికవ్యవహారాలలో పడి,మానవుడు తాను ఎవరైనదీ మరచిపోతున్నాడు. “నేనెవరు?” అని ప్రశ్నించుకొని,సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు.

ఈ నిస్పృహ నుండి బయటపడి జీవితం పట్ల ఆసక్తీ,ఉత్సాహం ఏర్పడాలంటే సమాజాన్ని, పరిస్థితుల్ని దాటి చూడాలి. అత్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ఇందుకు సంస్కృతి సహకరిస్తుంది

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Monday 13 November 2023

మౌనం యొక్క మహిమ (20-Nov-23, Enlightenment Story)

 *మౌనం యొక్క మహిమ*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

1. మౌనము జీవితమునకు పరమ మిత్రుడు.

2. మౌనము ద్వారా ఆత్మ చింతన యొక్క బలము లభిస్తుంది.

3. మౌనము  ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.

4. మౌనము ఆధ్యాత్మిక  జీవితము కొరకు బ్రహ్మాస్త్రము.

5. మౌనము అనగా వ్యర్థమైన మరియు సాధారణమైన సంకల్పాల నుండి ముక్తి అవ్వడం.

6. మౌనము మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది.

7. మౌనము అశరీరి స్థితిని తయారు చేసుకునేందుకు సహజ సాధనం.

8. మౌనము అనగా శ్రేష్టమైన క్వాలిటీ కలిగిన సంకల్పాలు చేయాలి.

9. మౌనము -  వ్యర్థం నుండి ముక్తి చేసే అద్భుత ఇంజక్షన్.

10. మౌనము -  ఆలోచనా విధానాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు ఒక టానిక్.

11. మౌనము - కలహః, క్లేశాలను సమాప్తం చేసే ఒక మంచి ఔషధం.

12. మౌనము -  మనస్సు యొక్క స్థితిని ఏకరసంగా తయారుచేసే మందు.

13. మౌనము - మౌనం యొక్క సాధన ద్వారా మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది.

14. మౌనము - స్వధర్మంలో స్థితులయ్యేందుకు ఒక  శ్రేష్ఠ విధి.

15. మౌనము - పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యేందుకు సహజ ఉపాయం.

16. మౌనము -  విస్తారాన్ని సారములోనికి తీసుకువచ్చేది.

17. మౌనము - దేహము మరియు దేహపు ప్రపంచము నుండి అతీతంగా అయ్యేందుకు సహజ ఉపాయం.

18. మౌనము-  పరమాత్మ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేందుకు సహజ సాధనము  

19. మౌనము - మన్మనాభవ మరియు మధ్యాజీభవగా అయ్యేందుకు  సంజీవని మౌలిక.

20. మౌనము - పరమాత్మ శక్తులను అనుభూతి చేసుకొనేందుకు శ్రేష్ట మార్గము.


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

తృప్తితోనే పరమానందం! (19-Nov-23, Enlightenment Story)

     *తృప్తితోనే పరమానందం!*

     🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

"గురూజీ! నేను ఈ గ్రామములో ధనికుణ్ణి. విరివిగా  దాన ధర్మాలు చేస్తుంటాను. తమరు మా గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశాను. మీరు దయతో  మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను.

"ఓ కోటీశ్వరుడా! విశ్వాన్ని సృష్టించినా, నిగర్వముగా ఉండే పరమాత్ముని కన్నా ధనికుడెవరు ? మేరు పర్వతమంత ధనం కూడా ఆయనకు చిల్లి గవ్వతో సమానం. ప్రకృతి దాన గుణానికి మరో పేరు. అది అందరికీ అన్నిటినీ ఇస్తూనే ఉంటుంది.    అలాంటి ప్రకృతిని ప్రపంచానికి దానం చేసిన మహాదాత ఆపరమాత్మ. ఆయన దాతృత్వం ముందు ఎవరూ అధికులు కారు. 

నేను మర్యాదలు ఆశించను. నీకంటే ముందు ఈ పేద వడ్రంగి తన ఇంటికి భోజనానికి పిలిచాడు. నేను ఎవరి ఇళ్ళకు వెళ్ళను. అది తెలిసే అతడు ఇక్కడికే ఆహారం తెచ్చాడు. నువ్వు కూడా అలాగునే చేయవచ్చును!" అని అన్నాడు గురు నానక్.

ఆ మాటలు విన్న కోటీశ్వరుడు "అలాగే గురు మహరాజ్ !" అంటూ తన సేవకులతో విందు భోజనాన్ని పరుగుల మీద అక్కడికి తెప్పించాడు.

గురునానక్ చుట్టూ ఆ గ్రామ ప్రజలు చేరారు. ఎవరి ఆహారం గురువు మెచ్చుకొంటాడో అని అందరూ కుతూహలంతో చూస్తున్నారు.  వండ్రంగి తెచ్చిన ఆహారంలో ముతక గోధుమ పిండి రొట్టెలు, రెండు మామిడి పళ్ళు వున్నాయి.

ధనికుడు తెచ్చిన ఆహారంలో మేలు రకం గోధుమ పరోటాలు, పసందైన మామిడి రసాలు ఉన్నాయి. గురునానక్ కుడి చేత్తో, వండ్రంగి తెచ్చిన మామిడి పండు తీసుకొన్నాడు. ఎడమ చేత్తో ధనికుడు తెచ్చిన మామిడి పండు తీసుకున్నాడు.

ముందుగా వండ్రంగి తెచ్చిన మామిడి పండును గట్టిగా పిండాడు.  అందు లోంచి పాలు వచ్చాయి.  అందరూ ఆశ్చర్యపోయారు. 

మామిడి పండులోంచి పాలు రావడమేమిటని ? 

అప్పుడు ధనికుడు తెచ్చిన తెచ్చిన పండును పిండాడు గురునానక్. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎర్రని నెత్తురు కారింది. ధనికుని నోట మాట రాలేదు.

ఓ ధనికుడా ! ఈ వడ్రంగిది కష్టార్జితం. రెక్కల కష్టంతో సంపాందించినది. అందుకే అది పాలతో సమానం. నువ్వు అవినీతితో, పేదలను పీడిస్తూ కూడబెట్టిన సొమ్ము నెత్తుటి కూడుతో సమానము. అందువల్లన మాలాంటి సాధువులు తినకూడదు.

భగవంతునికి, సాధువులకు కష్టార్జితమే సమర్పించాలి. ఎవరికి వారు కష్టార్జితం తింటేనే, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అన్యాయార్జితం అనారోగ్యాన్నీ , అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది.

అందుకే అత్యాశకు బానిసలు కాకండి. లభించిన దానితో తృప్తి పొందండి. తృప్తితోనే పరమానందం లభిస్తుంది.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Friday 10 November 2023

🧘‍♂️ఒక మంచి స్ఫూర్తి నిచ్చే కథ🧘‍♀️ (18-Nov-23, Enlightenment Story)

 🧘‍♂️*ఒక మంచి స్ఫూర్తి నిచ్చే కథ*🧘‍♀️

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

దట్టమైన అడవిలో చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్ తొలి డెలివరీ కేసు1943 డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే హుబ్లీలో ఉంటాడు తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి.

జూలై తుఫాను రాత్రి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్ ’’

ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు. గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్.

ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… 

‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి 

ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు డాక్టర్ కదా ఊరుకోలేకపోయాడు

నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు ఆమెను అడిగాడు అసలు ఎవరు నువ్వు ? ఇక్కడికి ఎలా వచ్చావు..?’

‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ  *మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు* అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు  అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను ఈ కడుపు ఆ ప్రేమ వల్లే కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు.

 ఇటువైపు ఎవరూ రారు నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు అంటూ రోదించసాగింది. డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది. కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు. పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది. డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి. నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్’

కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు, పిల్ల ఏడ్చింది. ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే.తన జీతమే 75 రూపాయలు. ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది. ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు. ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు.

సంతోషమో, దుఖమో. మన చేతుల్లో ఏమీ లేవు. జరిగిందేదో జరిగిపోయింది. అన్నీ మరిచిపో .నీ జీవితం నీది ప్లాన్ చేసుకో ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది. అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు. వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు తను తప్పక సాయం చేస్తాడు ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఏళ్లు గడిచాయి. కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు. ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు. అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు. ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది. సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా.?’ అనడిగింది.

‘అవును, చాలా ఏళ్ల క్రితం. నాకు ఆ ఊరితో బంధముంది.అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’

‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’

‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్…నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను.

'ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’

‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది.

డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా ఆయన పాదాలపై పడింది ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్ ఆయన గందరగోళంలో పడిపోయాడు తరువాత ఆమె చెప్పింది

‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు ఆరోజు పుట్టింది ఈ బిడ్డే మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను స్టాఫ్ నర్స్ అయ్యాను నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను మీరే స్పూర్తి ఆశీర్వదించండి సార్అంది చేతులు జోడిస్తూ

ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి తన తొలి డెలివరీ కేసు ఆమె అదీ ఓ గడ్డు స్థితిలో డాక్టర్ చంద్రను అడిగాడు ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’ అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను

అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే.  మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే ఆమె చెబుతూనే ఉంది

ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు ఆగడం లేదు జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే

చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి.

ఆహా...ఎంత గొప్ప మనసులు...

ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదేమో.!!

ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.!  చదువుతుంటే  కళ్ల వెంట ఆనందబాష్పాలు రాల్చిన కథ.!


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

🪷🪷🧘‍♂️🧘‍♀️🪷🪷

Thursday 9 November 2023

మాయ యొక్క ప్రభావమును తప్పించుకోవడం (17-Nov-23, Enlightenment Story)

*మాయ యొక్క ప్రభావమును తప్పించుకోవడం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁               

పరమాత్మ పాదాలు ఆశ్రయిస్తే మనం ఎలా రక్షింపబడతాము. ఆ స్వామి పాదాలచెంతకు మనం చేరగలిగితే మనకిక ఏచింతా వుండదు.

అది ఎలానో వివరిస్తాను....

ఒక బెస్తవాడు చెరువులో చేపలు పట్టడానికి….  వలను చెరువులోనికి విసురుతూవుంటాడు. ఆ వలలో చిక్కుకొని ఎన్నో చేపలు ప్రాణాలు కోల్పోతుంటాయి. ప్రతిరోజు అదే విధంగా జరుగుతూ వుంటుంది రోజురోజుకూ చేపలసంఖ్య తగ్గిపోతూవుంటుంది. అప్పుడు ఆ చేపలకు ఒక ఆలోచన వచ్చింది…. 

ఆ బెస్తవాడికి దూరంగా మనము వుంటున్నాము కనుకనే  వలలో చిక్కుతున్నాము. అదే అతని పాదాలచెంత చేరామంటే వలలో పడబోము!’అనుకొని అన్నీ అతని పాదాలచెంతకు చేరుకున్నాయి. 

ఆరోజునుండి ఏచేపకూడా వలలో చిక్కుకోలేదు!   వాటి ప్రాణాలను  కాపాడుకోగలిగాయి. మనకు వచ్చే కలతలు కష్టాలు కూడా ఆ వలలాంటివే!

కాలం ఎప్పుడూ మనపై ఏదో ఒక మాయ అనే వల విసురుతూనే వుంటుంది! వాటికి భయపడకుండా మనము ఆ పరమాత్మ పాదాలు ఆశ్రయిస్తే మనకు తప్పక రక్షణ దొరుకుతుంది. 

’మన భారం అంతా ఆ తండ్రే చూసుకుంటాడు !’ అనే నమ్మకంతో వుండగలగాలి! అంతే... భగవంతుని పాదాలు ఆశ్రయించినవారికి మాయ దారి ఇస్తుంది!  అంటే వారి పై మాయ యొక్క ప్రభావం పని చేయదు.✍️

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...