Sunday 31 December 2023

కర్మ ఫలితము (01-Jan-24, Enlightenment Story)

కర్మ ఫలితము 

🌺🍀🌺🍀🌺🍀


*ధర్మరాజు భీష్ముడితో*పితామహా.. మీరు నాకు ఎన్నో ఉపదేశించారు. కాని నా మనసుకు కొంచెం కూడా శాంతి కలుగ లేదు. పట్టుబట్టి ఎంతో మందిని బంధువులను యుద్ధములో వధించాను. మిమ్ము అతి దారుణంగా శరతల్పగతుడిని చేసాను. ఇంత చేసిన నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది. పితామహా.. నేను దుర్యోధనుడుని రాజ్యం ఇద్దరము పంచుకుని పరిపాలిద్దాము అని ప్రాధేయపడ్డాను. అతడు అందుకు సమ్మతించ లేదు.*

*నేను మాత్రం పోతే పోనీలే అతడికే రాజ్యాన్ని వదిలి వేద్దాము అని అనుకున్నానా.. అలా ఉండక కోపంతో రగిలి పోయి పట్టుదలలకు పోయి యుద్ధం చేసాను ఫలితం సర్వనాశనం అయింది. ఈ నాడు పశ్చాత్తాపపడి ప్రయోజనమేమి.. ఇక నాకు దుఃఖం తప్ప శాంతి ఎలా కలుగుతుంది" అని బాధపడ్డాడు. అప్పుడు భీష్ముడు ఊరడింపుగా "ధర్మనందనా.. చింతించకుము అంతా దైవ నిర్ణయమే. దానిని తప్పించుట మనచేతిలో లేదు.*




*దీనికి ఒక కథ చెప్తాను విను... ఒక ఊరిలో గౌతమి అను బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒక రోజు పాము కరిచి చనిపోయాడు. అది చూసి ఆమె దుఃఖించ సాగింది. అంతలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పామును పట్టి తెచ్చి "అమ్మా.. ఇదిగో నీ కుమారుడిని కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమటావో చెప్పు. తలపగులకొట్టి చంపమంటావా.. లేక నిలువునా చీల్చి చంపమంటావా.. నీవు ఎలా చెప్తే అలా చేస్తాను" అన్నాడు.*

*గౌతమి.. "అన్నా.. ఈ పామును విడిచి పెట్టు" అన్నది. బోయవాడు "అమ్మా.. ఇది నీ కుమారుని చంపింది కదా.." అన్నాడు. గౌతమి.. "అన్నా.. విధి ప్రకారం ఈ ఆపద వచ్చింది. నా కుమారుడు చనిపోయాడు. అందుకు దుఃఖించడము సహజమే అయినా.. దానికి కారకులు అయిన వారిని చంపడం అధములు చేసే పని. ఉత్తములు, ధర్మ పరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచి పోతారు. అన్నా.. నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతుకుతాడా.. దానిని విడిచి పెట్టు" అన్నది.*

*బోయవాడు.. "అమ్మా.. నీ మాటలు నాలాంటి వాడికి అర్ధము కావు. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మము. కనుక ఈ పామును చంపుతాను" అని అన్నాడు. గౌతమి.. "అన్నా.. నీ పేరు అర్జునుకుడు. అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి నీవు ఇలా ప్రవర్తించ కూడదు. అయినా నేను హింసను ఎలా సహిస్తాను" అన్నది. బోయవాడు.. "అమ్మా.. నా మాట విను జనులను బాధించే వారిని చంపడమే ధర్మము దాని వలన పాపము రాదు" అన్నాడు. గౌతమి.. "తాను బంధించిన వాడు శత్రువైనా అతడిని చంపడము అధర్మము కదా.." అన్నది. "అమ్మా.. ఈ పామును చంపి ఈ పాము వలన బాధించబడు వారిని రక్షించడం ధర్మము కాదా.. వృత్తాసురుడిని దేవేంద్రుడు చంపలేదా.. అది ధర్మము అయినప్పుడు. ఇది మాత్రము ఎందుకు ధర్మము కాదు. కనుక ఈ పామును చంపుటకు అంగీకరించు" అన్నాడు..*

*అప్పుడు అక్కడ వీళ్ళ సంభాషణ మౌనంగా వింటున్న పాము బోయవానితో "అన్నా.. ఇందులో నా తప్పు ఏమీ లేదు. మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు" అని పలికింది పాము. బోయ వాడు "మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నిన్ను చంపడం తప్పు కాదు" అని పామును చంపబోయాడు.*

*అప్పుడు పాము.. "అయ్యా.. కుమ్మరి వాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారెదా.. కుమ్మరి వాడిదా తప్పు. అయ్యా నరులు కనపడితే నన్నే చంపుతారు కదా.. అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది" అన్నది. బోయవాడు "బాగా చెప్పావు సర్పమా.. ఎదుటి వాడు బాణం వేసినప్పుడు బాణము వేసిన వాడిది తప్పా బాణాది తప్పా అని ఆలోచిస్తూ ఊరుకుంటామా..*

*వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా.. అందులో పాపము ఏముంది. అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నే కాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి" అన్నాడు. అందుకు పాము నవ్వి.. "అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతే కాని నాది కాదు" అన్నది.*

*అప్పుడు అంతలో.. మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి "సర్పరాజమా.. నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి" అని మృత్యుదేవత పలికింది.*

*పాము.. "నువ్వు చెప్పినది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్పా, నీ తప్పా అని చెప్పడానికి నేను ఎవరిని అని బోయవాడితో.. "అన్నా.. మృత్యు దేవత మాట విన్నావు కదా.. నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా.. " అన్నది. బోయవాడు నవ్వి.. "నువ్వూ మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయము లేదు" అన్నాడు.*

*ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి.. "మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడానికై నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మ ఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మల ఫలితంగానే పుట్టుకు, మరణము, సుఖము దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకో లేరు. ఏ జీవికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. కనుక ఎవరిని నిందించవలసిన అవసరము లేదు" అన్నాడు.*

*అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి.. "అన్నా .. యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా.. నాకు పుత్ర శోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి.. కనుక ఆ పామును విడిచి పెట్టు" అన్నది. ఇందరి మాట విన్న బోయవాడ జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచి పెట్టాడు. కనుక ధర్మనందనా.. యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే.*

*నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా.. " అని చెప్పారు భీష్ము పితామహాలు...*

*🌀|సమస్తలోకా సుఖినోభవంతు|🌀*
 🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అంతా ఈశ్వరేచ్ఛ (31-Dec-23, Enlightenment Story)

అంతా ఈశ్వరేచ్ఛ  

🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

మహర్షి వ్యాసుని పుత్రుడు సుఖదేవ్ జనకరాజు వద్దకు దర్శనానికి వస్తాడు. అప్పుడు రాజు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అతని రాకకి కారణం అడుగుతారు. దానికి అతను మా తండ్రిగారు మీ దగ్గరకు విద్యార్థిగా నన్ను పంపారు అని చెప్తాడు. ఇంతలో ఒక సైనికుడు వచ్చి నగరం బయట అగ్గి తగులుకుందని చెప్పి మాకు ఏమీ ఆజ్ఞ  అని అడుగుతారు. 

మీరు మీ కర్తవ్యం చేయండి తర్వాత అంతా ఈశ్వరేచ్ఛ అని రాజు చెప్తాడు.  మళ్లీ సైనికులు వచ్చి నగరం లోపలికి అగ్ని మంటలు ప్రవేశించాయని, మళ్లీ భవనంలోకి ప్రవేశించబోతున్నాయని సైనికులు చెప్పి మేము ఏం చేయాలి అని అడుగుతారు రాజు గారిని. రాజుగారు మొదటి చెప్పిన విధంగా మీ కర్తవ్యం మీరు చేయండి తర్వాత అంతా ఈశ్వరేచ్ఛ అని చెప్తాడు. అది విన్న సుఖదేవ్ లో కంగారు మొదలవుతుంది. 

ఇతనా రాజా జనకుడు! నగరంలో అగ్ని తగులుకుంది ఈయనేమో చక్కగా ఇక్కడ కూర్చున్నారు అని మనసులో అనుకుని, వెంటనే లేచి అక్కడినుండి వెళ్ళబోతాడు .అది చూసి రాజు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు.అక్కడ గదిలో నా మూట, భిక్షా పాత్ర ఉన్నాయి అవి కాలిపోతాయేమో అని తెచ్చుకోవడానికి వెళుతున్నాను అంటాడు. 

అప్పుడు రాజు  నీకు ఆ మూట మీదే అంతా మోహం ఉంటే ఈ శరీరం మీద ఇంకెంత మొహం వుండి ఉంటుంది  అని నవ్వుతూ కూర్చోకూర్చో ఎక్కడా అగ్ని రగులుకోలేదు నేను నిన్ను పరీక్షించాను. చిన్న చిన్న వస్తువులపై ఇంత మొహం ఉంటే విధేహుడువి ఎలా అవుతావు అని అంటాడు. మా తండ్రిగారు ఇక్కడికి ఎందుకు పంపారు నాకు ఇప్పుడు అర్థమైపోయింది రాజా ...నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని చెప్తాడు. 

కానీ మరొక పరీక్ష నువ్వు ఇవ్వవలసి ఉంటుంది ఆ పరీక్ష ఏంటంటే నూనెతో నిండిన ఒక పాత్రను సుఖదేవ్ కి ఇచ్చి నగరం నుండి బయటకు పంపిస్తాడు. దానికి ఒక షరతును కూడా పెడతారు, ఆ పాత్ర నుండి ఒక్క చుక్క నూనె క్రిందపడిన వెనకనే కత్తి పట్టుకొని నడుస్తున్న సైనికుడు అతని మెడ నరుకుతాడు అని షరతు.  రాజు అతని ధ్యానం భంగం చేయడానికి ఏవేవో ఉపాయాలు కూడా చేయిస్తారు. కానీ సుఖ దేవుడు ఒక్క చుక్క నూనె కూడా క్రింద పడనీయకుండా జనకరాజు దగ్గరికి చేరుకుంటాడు.  ఒక్క చుక్క కూడా క్రింద పడలేదు జనక రాజ అని చెబుతాడు. అయితే నువ్వు మార్గంలో ఏమేం చూసావ్ అని అడుగుతాడు .నా ధ్యానం అంతా నూనె చుక్క మీదే ఉంది . మెడ దగ్గర కత్తి వేలాడుతున్నప్పుడ ఇటు అటు ఎలా చూడగలరు అని సుఖదేవ్ అంటాడు. అప్పుడు రాజు అంటాడు అదేవిధంగా ఎవరైతే ఈ జీవితం యొక్క నశ్వరత్వాన్ని తెలుసుకుంటారో... వారికి ఈ సంసారం యొక్క ఆకర్షణలు కనిపించవు. నువ్వు యోగ్యుడైన విద్యార్థి వి, నేను నీతో పాటు నా అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆ అనంతమైన చర్చ ప్రారంభమైంది .

చైతన్యరూపమైన బ్రహ్మ ద్వారా ఈ జగత్తు నడపబడుతున్నది అదే చేతన నాలోను ఉంది మరి అతను ఎవరు? నేనెవరు? అని సుఖదేవ్ ప్రశ్నిస్తాడు దానికి రాజు నేను, అతను అని వేరు వేరు అస్తిత్వం ఉండదు. నేను అదే.నువ్వు ఏ సత్ చిత్ ఆనందాన్ని వెతుకుతున్నావో... వాస్తవంలో అది స్వయంగా నువ్వే అయి ఉన్నావు. బ్రహ్మ ఈ జగత్తుని రచించారు, నా యొక్క రచన కూడా చేశారు కదా.. మరి నేను ఆ బ్రహ్మ ఎలా అవ్వగలను? మరొక ప్రశ్న వేశాడు సుఖదేవ్.

దానికి రాజు ఒక సమయంలో కేవలం బ్రహ్మే ఉండేవాడు ఇంకా ఏమీ ఉండేది కాదు చంద్రుడు, తారలు,భూమి, ఆకాశం ఏవి ఉండేవి కాదు కేవలం బ్రహ్మే ఉండేవారు. అతను స్వయంగా తన సృష్టిని రచించారు. మరియు స్వయంగా భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలములను సృష్టి చేశారు ఆ స్వయం వి నువ్వే మరియు నేను కూడా. ఈ సత్యాన్ని చూడలేకపోతే ఈ కనిపించే జగత్తునే సత్యం అనుకొని అందులోనే ఇరుక్కుపోతారు. కానీ ఎవరైతే ఈ సంసారం యొక్క ఆవరణలో దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకుంటారో, గుర్తిస్తారో వారే శుద్ధ చైతన్యం యొక్క ప్రాప్తిని పొందగలరు అని రాజు చెప్తారు.  అంటే ఆత్మ కంటే వేరే ఎవరికీ అస్తిత్వం లేదన్నమాట.  

అవును ఇంకా చెప్పాలంటే బ్రహ్మ మరియు వ్యక్తి లోపల ప్రకాశితమవుతున్న మూలతత్వం ఆత్మ, 'అయమాత్మ బ్రహ్మ' అందువలన ఓ సుఖదేవ్ మనసును ఆత్మపై కేంద్రీకరించు మరియు దాంట్లోనే స్థిరంగా ఉండు.  ఎందుకంటే ఆ ఆనందానివి నువ్వే. అని రాజు చెప్తాడు.  ఎప్పటి వరకు నేను బ్రహ్మను అనే అనుభవం కలుగదో అప్పటివరకు మనసు మరియు ఇంద్రియాలపై నియంత్రణ ఉండాలి. గురు బోధలను వినడం శాస్త్రాల అధ్యయనం అనేవి ప్రతి దినం మననం, ధ్యానం చేయాలి.

హరిః ఓం 🙏🏻 జై గురుదేవా 🙏🏻🌺హరిః ఓం  శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓం🙏🏻

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday 29 December 2023

సుఖం…సంతోషం…ఆనందం… (30-Dec-23, Enlightenment Story)

 సుఖం…సంతోషం…ఆనందం…     

🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి. కానీ, నేడు అనేకులది తమ సహజస్థితి తెలుసుకోలేక  ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ.

సుఖం, సంతోషం, ఆనందం....ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడురకాల అనుభూతులు. 

  • పంచేంద్రియాలను సంతృప్తిపరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది. 
  • వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే 'సంతోషానుభూతి' మానసికం.
  • వీటికి అతీతమైంది *ఆనందానుభూతి*ఆత్మసంబంధితం. ఆనందం ఆధ్యాత్మికం. బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గతఅనుభూతి.

సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం. శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి  వస్తాం.

మొదటిది బంధం, రెండవది తాత్కాలితం, మూడవది శాశ్వతం. మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జననమరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు. కానీ పరమానందస్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.

ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధికస్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులలోనైన సమస్థితిలో వుండగలగడం, అన్నీ - అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.


మనభావాలపట్ల, మనలో ఉన్న ఆంతర్యామిపట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటిపట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామి పట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.

ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు.(తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి). మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.

మొదటికొస నుండి రెండవకొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం. మొదటికొస నుండి రెండవకొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.

వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత. మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.

ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం............. పేరు ఏదైతేనేం........... అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే.

ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది. మనలోపలేవున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి. అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని.

ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం ఆనందమంటే పరమానందం. ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి".   ఇలా ఆనందమును తెలుసుకున్నవారు  (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).

ఆనందమునకు సోపానములు -

  • ఫలాపేక్ష లేకుండా పనిచేయడం
  • అందరిలో అంతర్యామిని గుర్తించడం
  • ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం
  • భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం .✍️

         

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday 24 December 2023

అడవిలో ఒక కాకి నివసిస్తుంది (24-Dec-23, Enlightenment Story)

 అడవిలో ఒక కాకి నివసిస్తుంది.  అది జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందింది.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

అయితే ఒకరోజు కాకికి హంస కనిపించింది. *ఈ హంస చాలా తెల్లగా ఉంది,  నేను చాలా నల్లగా ఉన్నాను. ఈ హంస ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షి అయి ఉండాలి*.హంసకి తన ఆలోచనలు చెప్పింది.  హంస బదులిచ్చింది.

"వాస్తవానికినేను రెండు రంగులు ఉన్న చిలుకను చూసే వరకు, నేనే అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను భావించాను. కానీ సృష్టిలో చిలుక అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను ఇప్పుడు భావిస్తున్నాను.


ఆ తర్వాత కాకి చిలుక దగ్గరికి వస్తే, చిలుక ఇలా వివరించింది, “నేను నెమలిని చూసే వరకు చాలా సంతోషంగా జీవించాను. నాకు రెండు రంగులు మాత్రమే ఉన్నాయి, కానీ నెమలికి అందమైన ఎన్నో రంగులు ఉన్నాయి అంది.

కాకి అప్పుడు జూలోని ఉన్న నెమలిని సందర్శించింది, నెమలిని చూడటానికి వందలాది మంది ప్రజలు గుమిగూడారు. జనం వెళ్ళిన తర్వాత కాకి నెమలి దగ్గరికి వచ్చింది.

కాకి ఇలా చెప్పింది, "ప్రియమైన నెమలి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రతిరోజూ వేలాది మంది నిన్ను చూసేందుకు వస్తుంటారు. ప్రజలు కాకిని అయిన నన్ను చూసినప్పుడు, వారు వెంటనే తరిమికొడతారు. మీరు ఈ గ్రహం మీద అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను అని అంది. దానికి నెమలి ఇలా జవాబిచ్చింది, “నేను ఈ గ్రహం మీద అత్యంత అందమైన మరియు సంతోషకరమైన పక్షిని అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ నా అందం కారణంగా నేను ఈ జూలో చిక్కుకున్నాను.

నేను ఈ జూ అంతా చాలా జాగ్రత్తగా పరిశీలించాను, పంజరంలో ఉంచని ఏకైక పక్షి కాకి అని నేను గ్రహించాను. అందుకే కాకిని అయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆనందంగా తిరుగుతానేమో, అని గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను. ఆ నెమలి మాటలు విన్న కాకి అవాక్కయ్యింది.🍁

*నీతి: ఇది మన సమస్య కూడా. ఇతరులతో అనవసరమైన పోలిక పెట్టుకుని బాధపడతాం. దేవుడు మనకు ఇచ్చిన వాటికి మనం విలువ ఇవ్వము. ఇదంతా దురదృష్టం అనే విష చక్రానికి దారి తీస్తుంది. లేనిదానిని చూసే బదులు ఉన్నవాటిలో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మీ కంటే ఎక్కువ లేదా తక్కువ కలిగి ఉండే ఎవరైనా ఎల్లప్పుడూ ఉంటారు. తన వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని తెలుసుకోవాలి*.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

నేరం (28-Dec-23, Enlightenment Story)

 *నేరం*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

*“ధర్మానికి హాని కలిగించే చర్య నేరం” అని పురాణ భాష్యం.  ‘నీతిబాహ్యమైన  చర్యలన్నీ నేరమనియు, ప్రజలలో ధర్మచ్యుతి కలిగినప్పుడు సమాజంలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుందనియు,  విచ్ఛిన్నకర శక్తులు ప్రళయతాండవం  చేస్తాయని’ ధర్మశాస్త్రాలు  హెచ్చరించాయి.*

*“ధర్మాన్ని ప్రజలు స్వచ్చందంగా నిర్వర్తించి నంతవరకు నేర ప్రవృత్తికి  చోటు లేదనియు,  న్యాయస్థానాల అవసరం ఉండదనియు“ నారద స్మృతి తెలిపినట్టుగా,   పురాతన కాలంలో  ధర్మోద్ధరణ కోసం వేదాల్ని, స్మృతుల్ని ఆశ్రయించేవారు పాలకులు.*

*సర్వశుభాలకు, లోక  శ్రేయస్సుకు  ధర్మమే  నిలయమని భావించి  ధర్మనిష్ఠ పెంపొందించడానికి  పాటుపడేవారు.*   

 *‘ధర్మం నుంచి సంపద, సుఖము ప్రభవిస్తాయని’ రామాయణం తెలుపగా, '
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అని బోధించాడు గీతాచార్యుడు.  
'సజ్జన సంరక్షణ, దుష్టజన శిక్షణ  కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తానని' పలికినట్టే  అనేక అవతారాలెత్తాడు  శ్రీమహావిష్ణువు.*

*జ్ఞానసారమైన వేదాలను రక్షించడానికి మత్స్యావతారంలో హయగ్రీవుడిని, 
రామావతారంలో రావణ కుంభకర్ణాది దానవులను, 
కృష్ణావతారంలో  శిశుపాల దంతవక్త్రులు, 
కంసుడు మున్నగు దుష్టులను ,  
వరాహావతారంలో హిరణ్యాక్షుని,  
నరసింహావతారంలో, హిరణ్యకశిపుడ్ని సంహరించి ధర్మోద్ధరణ చేసాడు.*

*‘రాజులు న్యాయపాలన చేయాలనియు,  దోషులను శిక్షించి ప్రజలను రక్షించాలనియు ,దోష నిర్ధారణకు సాక్షులను విచారించాలని” గౌతముడు చేసిన సూచనలు న్యాయాధీశులకు  మార్గదర్శనం  చేస్తాయి.  ‘మరణ దండనార్హుడైన అపరాధితో కూడా చిరునవ్వుతో  న్యాయాధీశుడు సంభాషించాలనియు,   కోపాన్ని ప్రదర్శించరాదని’ విష్ణు ధర్మ సూత్రాలు చేసిన  సూచనలు సర్వదా అనుసరణీయమే.*

*“సుశిక్షకుడైన పాలకుడు  ప్రజలను  ధర్మపథంలో నడిపించగలడనియు, అధర్మ వర్తనుడైన రాజైనచో  ప్రజలు అధర్మపరులగుతారనియు, అట్టి  రాజ్యాలలో వర్షాలు కురవవనియు , పంటలు పండవనియు ,  అరిష్టం కలుగుతుందని” శుక్రనీతి బోధించిన సారాన్ని  గ్రహించి ధర్మరక్షణకై  సద్వర్తనను అలవరచుకోవాలి పాలకులు.*

*“పరిస్థితుల ప్రాబల్యం వల్ల నేరం జరిగినప్పటికీ అది  శిక్షార్హమేననియు,   సాంఘిక విలువలు మారేటప్పుడు నేరం యొక్క నిర్వచనం, నేరస్థుడ్ని చూసే దృష్టికోణం  మారుతుందని” గ్రంథాలు తెలిపినట్టు,  “ ఒక సంస్కృతిలో యుగస్వభావాన్ని అనుసరించి ఒక చర్య నేరం కావచ్చు, కాక పోవునూ  వచ్చునని’ ధర్మశాస్త్రాలు  వచించినట్టుగానే జరిగిన  సంఘటనలున్నాయి.  బ్రిటీష్  పాలనా కాలంలో ప్రజలు చేసే  పోరాటాన్ని దేశభక్తిగా భారతీయులు  ప్రకటించుకోగా, రాజద్రోహంగా గుర్తించి   చెరసాలకు తరలించి శిక్షలు విధించారు  బ్రిటీషు  పాలకులు.*

*‘నాగరికత ప్రసాదించిన విషఫలమే నేరమనియు,  సమాజంలో కనిపించే నేరమేదైనప్పటికీ, అందుకు కారణ భూతమైన  సమాజానిదే తప్పిదమనియు, అసమానతల ప్రభావమే నేరాన్ని ప్రోత్సహిస్తుందని’ వినిపించే వాదనలకు  ప్రాముఖ్యతనిచ్చి సమసమాజస్థాపనకు పూనుకున్నప్పుడే   నేరస్థులు లేని సమాజాన్ని దర్శించగలం.*


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

ఉరుములయ్య మెరుపులమ్మ (29-Dec-23, Enlightenment Story)

 *ఉరుములయ్య మెరుపులమ్మ* (జానపద సరదా కథ)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

ఒకూర్లో నలుగురు అన్నదమ్ములు వుండేటోళ్ళు. వాళ్ళకో చెల్లెలుంది. ఆమెది అద్భుతమైన అందం. ఆమెని చూస్తే కండ్లు మిరుమిట్లు గొలుపుతాయి. అందుకే అందరూ ఆమెకు 'మెరుపులమ్మ' అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళన్నోళ్ళకే గాక వదినెలకు గూడా ఆమె అంటే చానా ప్రేమ. అడిగింది అడిగినట్లు తెచ్చియ్యడమే తప్ప కాదు... కూడదు... అని అనేటోళ్ళు కాదు.

ఒకరోజు అన్నావదినలంతా చేనుకి పోతా వుంటే చూసి ''నేనొస్తా... నేనొస్తా...'' అని ఆ పాప వెంట పడింది. ''వద్దమ్మా...అంతదూరం నువ్వు నడవలేవు...అదీకాక ఎండకూడా'' అని వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. దాంతో వాళ్ళు చెల్లెలు నడచి కష్టపడగూడదని ఎద్దులబండి కట్టి, ఎండ పడకుండా దానిపైన ఒక దుప్పటి వేసి ఆమెని దాంట్లో తీసుకోని పోయినారు. పొలంలో ఆమెను ఒక చెట్టు కింద కూచోబెట్టి ఎద్దులకు నాగలి కట్టి దున్నుతా వుంటే... వానదేముడు... ఒక్కొక్కరోజు ఒక్కొక్క వూర్లో వాన కురిపిస్తా... కురిపిస్తా... ఆరోజు మిట్టమధ్యాన్నం వాళ్ళుండే వూరికి వచ్చినాడు. వానదేముడొచ్చేది వాన కురిపియ్యడానికే గదా...దాంతో కుండపోతగా వాన కురిపియ్యడం మొదలుపెట్టినాడు. నేలంతా తడిసి ముద్ద ముద్ద కాసాగింది. పనంతా మధ్యలో ఆగిపోయింది.


అది చూసి మెరుపులమ్మ ''ఈ వానదేముడు వచ్చేదేదో రాత్రిపూట రావొచ్చుగదా... ఇట్లా మిట్టమధ్యాన్నం వచ్చి సతాయించే బదులు'' అనింది. ఆ మాటలు విన్న వానదేముడు ఎవరబ్బా ఇట్లా అంటున్నారని కిందికి చూసినాడు. చూస్తే ఇంగేముంది మిరుమిట్లు గొలుపుతా మెరుపులమ్మ కనబడింది. ''అబ్బ ఎంత బాగుంది అచ్చం పాలరాయి లెక్క'' అని ఆచ్చర్యపోయి ''సరే...రాత్రికే వస్తాలే'' అని చెప్పి ఆగిపోయినాడు. అది చూసి అన్నలంతా ''నా చెల్లెలు చెప్తే ఆఖరికి వానదేముడు గూడా మాట వింటాడు చూడు'' అని మురిసిపోయినారు.

ఆరోజు రాత్రి ఆమె గదిలో నిద్రపోతా వుంటే అర్ధరాత్రి తలుపు చప్పుడయ్యింది. ''ఎవరబ్బా... ఇంతర్ధరాత్రి తలుపు కొడ్తా వున్నారు'' అని తెరచి చూస్తే ఇంగేముంది నెత్తిన కిరీటం ధగధగా మెరిసిపోతా వుంటే చిరునవ్వులు నవ్వుతా వానదేముడు కనబన్నాడు. ఆమె ఆచ్చర్యపోయి ''ఏమిట్లా వచ్చినావు...ఇంత రాత్రప్పుడు'' అనడిగింది. దానికా వానదేముడు ''నువ్వేగదా... ఈ రోజు మధ్యాన్నంపూట మీ వూరికొచ్చి వాన కురిపిస్తా వుంటే...ఇప్పుడెందుకొచ్చినావ్‌...రాత్రిపూట రాగూడదా... అనింది... అందుకే వచ్చినా... నువ్వంటే నాకు చానా ఇష్టం. నన్ను పెండ్లి చేసుకుంటావా'' అనడిగినాడు. దానికామె ''సరే...రేప్పొద్దునొచ్చి మా అన్నోళ్ళతో మాట్లాడు'' అనింది సిగ్గు పడతా.

వానదేముడు తరువాతరోజు పొద్దున్నే లెక్కబెట్టలేనన్ని నగలూ, వజ్రాలు, వైఢూర్యాలు తీసుకోనొచ్చి ''మీ చెల్లినియ్యమని'' వాళ్ళన్నోళ్ళని అడిగినాడు. ఏకంగా వానదేముడే వచ్చి నీ చెల్లెల్ని పెండ్లి చేసుకుంటా అనడిగితే ఎవరు కాదంటారు... దాంతో వాళ్ళు సరే అన్నారు. వూరు వూరంతా వచ్చి ఆ చూడముచ్చటైన జంటని ఆశీర్వదిస్తా వుంటే అంగరంగ వైభోగంగా పెండ్లి చేసినారు. వానదేమునికి ఆమె అంటే చానా చానా ఇష్టం గదా... దాంతో ఆడికీ ఈడికీ తిరగకుండా మట్టసంగా అమె దగ్గరే వుండిపోయినాడు.

వానదేముడు అట్లా ధర్మం తప్పి ఒక్కచోటనే వుండిపోతే ఎట్లా... దేశమంతా తిరుగుతా అంతటా వానలు కురిపియ్యాల గదా... కానీ ఆయన కొత్త పెండ్లాం మోజులో పడి అన్నీ మరచిపోయినాడు. దాంతో చుట్టుపక్కల వూళ్ళలో యాడా వానల్లేక చెట్లూ చేమలు అన్నీ ఎండిపోయి మనుషులకే గాక పశువులకు గూడా తిండి దొరకని పెద్ద కరువు వచ్చేసింది.

దాంతో ఒక ముసల్ది ''యాడున్నాడబ్బా... ఈ వానదేముడు'' అని ఒకొక్క వూరే వెదుక్కుంటా... వెదుక్కుంటా... ఒకరోజు ఆ వూరికొచ్చింది. వచ్చి చూస్తే ఇంగేముంది... ఆ వూరు యాడ చూసినా గలగల పారే నీళ్ళతో... పచ్చని పంటపొలాలతో కళకళలాడతా కనబడింది. అప్పుడా ముసల్ది ''ఓహో... ఐతే వానదేముడు ఈ వూర్లోనే ఎవరో ఒకరింట్లో వుంటాడు... అందుకే చుట్టుపక్కల అన్ని వూళ్ళూ కరువుతో నాశనమయి పోతా వున్నా... ఈ వూరు మాత్రం పచ్చగా వుంది'' అనుకోనింది.

ఆ ముసల్ది నెత్తిన పుచ్చు చింతకాయల గంప పెట్టుకొని ''చింతకాయలమ్మా... చింతకాయలు'' అని అరుచుకుంటా పోసాగింది. అట్లా ఒకొక్క ఇండ్లే దాటుకుంటా... దాటుకుంటా... ఆఖరికి వీళ్ళింటికి చేరుకోనింది. చింతకాయలనే మాటినగానే నోట్లో నీళ్ళూరి మెరుపులమ్మ ఆమెని ఇంట్లోకి పిల్చింది. పిలిచి చూస్తే ఒక్కటి గూడా మంచిది లేదు... అన్నీ పుచ్చులే... అది చూసి ఆమె ''ఏందమ్మా ఇది... అన్నీ ఇట్లా వున్నాయి. ఎవడు కొంటాడు దీండ్లని'' అనింది. దానికా ముసల్ది కండ్లనీళ్ళు బెట్టుకోని ''ఏం చేద్దాం చెప్పమ్మా...మీ వూళ్ళో మాదిరి అన్ని వూళ్ళలో బాగా వాన పడ్తే మంచి మంచి చింతకాయలు వద్దన్నా వస్తాయి. కానీ మా వూళ్ళో వాన లేక ఇప్పటికి మూడు సంవచ్చరాలయిపోతా వుంది. అందరినీ సమానంగా కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకోని చూసుకోవాల్సిన ఆ వానదేమునికి ఏం పోయేకాలమొచ్చిందో ఏమో... మీ వూళ్ళో తప్ప యాడా వాన కురిపియ్యడం లేదు. వాని మీద బండబడ... సర్వనాశనమయి పోతాడు'' అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.

తన మొగున్ని అట్లా తిడ్తా వుంటే మెరుపులమ్మ చానా బాధపడి ఆ ముసల్ది పోగానే మొగుని దగ్గరికి పోయి ''దేశమంతా నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడ్తా వుంటే... నువ్వేమో హాయిగా యాడికీ పోకుండా ఈన్నే కూచోనున్నావ్‌. వానదేముడన్నాక ఒకూర్లో... ఒకింట్లో... వుంటే ఎట్లా చెప్పు. పో... పోయి... అంతా తిరిగిరాపో'' అనింది.

కానీ వానదేమునికి పెండ్లాన్ని ఇడ్చిపోవడం ఇష్టం లేక ''నేనుగాని బైటికి పోయినానంటే మళ్ళా ఎప్పుడొస్తానో నాకే తెలీదు. ఒక వూరూ కాదూ... ఒక దేశమూ కాదూ. ఈ భూగోళమంతా ఆ మూల నుండి ఈ మూల వరకు పిలిచిన చోటికల్లా పోయి రావాల'' అన్నాడు.

అప్పుడామె ''అందరితోనూ మాట పడ్తా బతికే బతుకూ ఒక బతుకేనా... మనిషి పుట్టుక పుట్టినాక కాస్తన్నా మానం మరియాద వుండాల. నీ ధర్మం నువ్వు నెరవేరిస్తే మనం మాట పడాల్సిన అవసరం లేదుగదా'' అనింది.

అప్పుడు వానదేముడు ఆమెని విడిచిపెట్టిపోలేక ''సరే... నువ్వు అంతగా చెబుతావున్నావు గాబట్టి పోతా... కానీ నువ్వు గూడా నాతో రావాల. నిన్ను విడిచి నేనుండలేను'' అన్నాడు. దాంతో ఆమె జనాలందరి బాగు కోసం సరే అనింది. అంతే... వెంటనే వానదేముడు వురుముకుంటా వానలు కురిపియ్యడానికి బైలుదేరితే... ఆయన వెంబడే మెరుపులమ్మ కూడా మెరుసుకుంటా ఆకాశానికి ఎగిరింది.

పూర్వకాలంలో వాన పడ్తా వున్నప్పుడు ఆకాశంలో వురుములే తప్ప మెరుపులు ఎప్పుడూ కనబడేవి గాదట. కానీ ఇద్దరూ అట్లా వురుముకుంటా, మెరుసుకుంటా బైలుదేరినప్పటి నుండి మనకు వానతోపాటు మెరుపులు గూడా మిరుమిట్లు గొలుపుతా కనబడ్తా వున్నాయి.


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

సంస్కరణ (27-Dec-23, Enlightenment Story)

 *సంస్కరణ*

🍀🌺🍀🌺🍀🌺🍀

బౌద్ధమత ప్రచారం చేస్తున్న గౌతమబుద్ధుడు ఒకసారి శిష్యులతో కలిసి కోసల రాజ్యానికి బయలుదేరాడు. ఆ మార్గంలో ఎదురయ్యే ఒక దట్టమైన అడవిలో అంగుళీమాలుడు అనే దోపిడీ దొంగ ఉండేవాడు. బాటసారులను నిర్దాక్షిణ్యంగా హింసించి ధన, మాన, ప్రాణాలు దోచుకొని చనిపోయినవారి చేతివేళ్ళను కత్తిరించి మెడలో హారంగా వేసుకునేవాడు.
ఆ మార్గంలో ప్రయాణించవద్దని, అంగుళీమాలుడి వలన ప్రమాదం జరుగుతుందని బుద్ధుడికి చెప్పారు ప్రజలు. అంగుళీమాలుడి వంటి వారిలో పరివర్తన కలిగించడమే తన పని అని చెప్పి ముందుకు కదిలాడు బుద్ధుడు. వారికి ప్రమాదం కలుగుతుందేమోనని ప్రజలు వారిస్తుంటే, శిష్యులు కూడా భయపడ్డారు.

మార్గమధ్యంలో ఒక కొండ కనబడింది వారికి. అంగుళీమాలుడు ఉండేది కొండమీదేనన్న విషయం బుద్ధుడికి గుర్తువచ్చి కొండమీదకు నడిచాడు. తనవైపు వస్తున్న బుద్ధుడిని దూరం నుండి చూడగానే అంగుళీమాలుడు ముఖం కోపంతో ఎరుపెక్కింది. తనపేరు చెబితేనే జడుసుకుంటారు జనం. అలాంటిది వెతుక్కుని వస్తున్నాడు అనుకున్నాడు మనసులో.



ఎవడ్రా ఇటు వస్తున్నది?’ అని భయంకరంగా అరిచాడు అంగుళీమాత్రుడు. వాడి మాటలకు శిష్యులకు అడుగు ముందుకు పడలేదు. భయంతో ఆగిపోయారు. బుద్ధుడు ముందుకు నడుస్తూనే ఉన్నాడు.అంగుళీమాలుడు అప్పటికే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని చంపి వెయ్యో వ్యక్తికోసం చూస్తున్నాడు. న మాటలు లెక్కచేయకుండా వస్తున్న బుద్ధుడిని చూడగానే ‘వెయ్యోవాడు’ ఇతడేనేమో అనుకున్నాడు. వెంటనే కత్తి అందుకున్నాడు అదే సమయంలో అంగుళీమాలుడిలో ఆందోళన మొదలైంది. వస్తున్నవాడు సాధువు, మంచివాడిలా కనబడుతున్నాడు. ఇతడిని చంపాలా వద్దా అన్న వూగిసలాట మొదలైంది.

బుద్ధుడిని చూస్తూనే ‘వెనక్కు పారిపో, లేదంటే చస్తావు’ అని అరిచాడు అంగుళీమాత్రుడు.బుద్ధుడు ఆ అరుపులు పట్టించుకోలేదు. వినబడనట్లే ముందుకు నడుస్తూ ‘పారిపోతున్నది నువ్వే, ఆగు వస్తున్నాను’ అన్నాడు.

అంగుళీమాలుడికేమీ అర్థం కాలేదు. ‘నేను పారిపోతున్నానా? ఆగాలా? పిచ్చివాడిలా ఉన్నాడే’ అనుకున్నాడు. బుద్ధుడి మొహంలోని ప్రశాంతత, ఆకర్షణ అంగుళీమాలుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ‘పారిపో, దగ్గరకు వస్తే చస్తావు’ అన్నాడు.

బుద్ధుడు నవ్వుతూనే ఎదురువెళ్లి నిలబడ్డాడు. ప్రాణంమీదకు వచ్చినా భయపడని బుద్ధుడిని చూసి కోపోద్రిక్తుడు అయ్యాడు అంగుళీమాత్రుడు. ‘నువ్వెందుకు భయపడలేదు? నన్ను పారివద్దని చెబుతున్నావు. నేనెందుకు పారిపోతాను? నిన్ను చంపితే వెయ్యిమందిని చంపినవాడినవుతాను’ అన్నాడు అంగుళీమాలుడు.

బుద్ధుడు చిరునవ్వు చిందిస్తూనే ‘నన్ను పారిపొమ్మని చెప్పినపుడే నువ్వు భయపడ్డావు. పాపం ఎక్కడ వుంటుందో భయమక్కడ ఉంటుంది’ అన్నాడు.

అంగుళీమాత్రుడు ‘నిన్ను చంపుతాను కాబట్టి నువ్వే భయపడాలి. ఒక్క వేటుకి నీ తల నరుకుతా’ అని కత్తి ఎత్తాడు.
‘‘నా మాటలు విన్న తరువాత నీకు నచ్చినట్టు చేయవచ్చును. నువ్వు చేస్తున్న హత్యాకాండ నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే వుంటుంది. నువ్వు చేసింది తప్పని తెలిసినరోజున పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వుంటుంది. హింసను వదిలి అహింసమార్గంలోకి అడుగుపెట్టి కొత్త జీవితం ప్రారంభించు’ అని బోధించి, ‘ఇపుడు నా తలను ఖండించు’ అంటూ తల వంచి నిలబడ్డాడు బుద్ధుడు.

కొద్దిక్షణాల తరువాత తలెత్తి చూస్తే అంగుళీమాలుడు నేలమీద పడి ఏడుస్తున్నాడు. ‘‘స్వామీ! ఈ దుర్మార్గుడిని క్షమించండి’’ అంటున్నాడు. బుద్ధుడు అతడిని లేవనెత్తి హృదయానికి హత్తుకుని ‘నువ్వు బందిపోటు వేషాన్ని ధరించావు కానీ ఒక సాధుసన్యాసివి. బందిపోటు గుర్తులు తీసేసి నిలబడు’ అనగానే అతడు మెడలో వున్న అంగుళీమాలను తీసి పారేసాడు.

బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేసి ‘పూర్వజన్మ పుణ్యఫలాల వలన నీ దర్శన భాగ్యం కలిగి ధన్యుడినయ్యాను. మీ శిష్యుడిగా స్వీకరించండి’ అని ప్రార్థించాడు. అప్పటినుండి అహింసామార్గంలో అడుగుపెట్టి బుద్ధుని శిష్యగణంలో కలిసిపోయాడు అంగుళీమాలుడు.

అంతటి అంగుళీమాలుడు కూడా శాంతియుత జీవనం సాగిస్తూ భిక్షకోసం వెళ్లినపుడు, ప్రజలతడ్ని బందిపోటుగా గుర్తించి రాళ్లతో కొట్టి హింసించినా ఎదురుతిరగలేదు. బుద్ధుడి ఒడిలో ప్రాణాలు వదిలాడు.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


నీప్రాణాలు తీయడానికి వచ్చిన యముడను (26-Dec-23, Enlightenment Story)

 *నీప్రాణాలు తీయడానికి వచ్చిన యముడను*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺  🍀🌺🍀🌺🍀🌺🍀🌺  

ఒకసారి ఒక వ్యక్తికి  దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి  అతను యమధర్మరాజని తెలియదు.యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే,కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు *నీళ్లు* ఇచ్చి దాహం తీర్చాడు.

నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను *నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడను...    కానీ! నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని, యమధర్మరాజు ఆ వ్యక్తికి  ఒక *డైరీ* ఇచ్చారు.

నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే *జరిగి తీరుతుంది* కానీ గుర్తుంచుకో...నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే....ఆ వ్యక్తి  ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు.

మొదటి పేజీలోనిది చదివాడు...
అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు.

తర్వాత పేజీ చదివాడు...

"తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది " అది చదివి అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు.

తర్వాత పేజీలో "తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికీ ఒకటి చేస్తుంది" అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు,

ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ....ఏదో వొకటి రాస్తూ...

చివరికి...!
ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా...ఈలోపే  యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి  డైరీని తీసుకుని,నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. *నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే, నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా... స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, చావుదాకా తెచ్చుకున్నావు*

నీ యొక్క మృత్యువు  నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు  యముడు.

ఆ వ్యక్తి  చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు.

 ఈ కథ యొక్క *అర్థం* ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో *అద్భుతమైన అవకాశాలను*

తానే స్వయంగా గానీ...బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు,ఇరుగుపొరుగువారు,బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు.కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ *ఇతరులకు చెడు చేస్తూ* మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము.ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా *భగవంతుని కృప నిండి ఉంటుంది.*

ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి 
*"మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి"* అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు.
కానీ మనము పర చింతన చేస్తూ సమయము  వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం
.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

పరమ పిసినారి సోమనాథం (25-Dec-23, Enlightenment Story)

*పరమపిసినారి సోమనాథం*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺  🍀🌺🍀🌺🍀🌺🍀🌺  

*పరమ పిసినారి సోమనాథం తినీతినకా  కూడబెడుతున్న సమయంలో ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా వున్నదని తెలిసింది.*

*దాంతో తను కూడబెట్టుకున్న సంపదనంతా భద్రంగా దాచి పెట్టాలని నిర్ణయించుకుని భార్య సుగుణను పిలిచి- "మనం సంపాదించిన సంపద మొత్తాన్నీ రెండు భాగాలు చేసి పంచుకుందాం. నేను నా భాగాన్ని నాకు తెలిసిన చోట దాస్తాను. నీ భాగాన్ని నువ్వు నీకు తెలిసిన చోట దాచు. ఒక వేళ దొంగలు పడి మన ఇల్లు కొల్లగొడితే ఒక భాగం పోయినా ఇంకో భాగం దక్కుతుంది" అన్నాడు.*

*"మీరు చెప్పినట్టు చేస్తాను; కానీ నా భాగాన్ని నేను ఎక్కడ దాచానో మీరు అడగకూడదు"* అంది సుగుణ.
*'ఎక్కడైనా దాచి పెట్టనివ్వు, సొమ్ము క్షేమంగా ఉంటే అంతే చాలు' అనుకున్న సోమనాథం, ఆమె షరతుకు ఒప్పుకున్నాడు.*


*కొంతకాలానికి అనుకున్నట్లుగానే దొంగల ముఠా కళ్ళు ఊళ్ళోని భాగ్యవంతుల ఇళ్ళన్నిటిమీదా పడ్డాయి. అందరినీ‌ నిలువునా దోచారు. సోమనాథం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగల పాలయ్యాయి. అతను రహస్యం గా దాచుకున్న సొమ్మంతా దొంగలపాలైంది. లబోదిబో మన్నాడు.*

*అంతలో భార్య సుగుణ వచ్చి ఓదార్చింది. ఆయన  భార్యని- "కనీసం నేను నీకు దాచమని ఇచ్చిన సొత్తయినా జాగ్రత్తగా ఉందా?" అని అడిగాడు.*

*"జాగ్రత్తగానే ఉందిలెండి!" అన్నది సుగుణ."పద, చూద్దాం!" అని సోమనాథం తొందరపడ్డాడు.*

*సుగుణ సోమనాథాన్ని ఒక మురికివాడకు తీసుకెళ్ళింది.*

*ఆ వాడ జనం మొత్తం పరుగున వచ్చి వాళ్ళిద్దరికీ మర్యాదలు చేశారు. "అమ్మా, మీరు చేసిన సాయం వల్ల మేము ఇలా చల్లగా బ్రతుకుతున్నాం. మీరు ఇచ్చిన డబ్బుతోనే మేము పొలాలు కొనుక్కొని సాగు చేసుకుంటున్నాం. మా పిల్లలు చదువుకుంటున్నారు. మా మాట ప్రకారం మేము ప్రతి నెలా మీకు కొంత డబ్బు, అలాగే పంటలో వాటాగా సంవత్సరానికి ధాన్యం పంపిస్తాం" అన్నారు.*

*వాళ్ళ అభిమానం, గౌరవ మర్యాదలు చూసిన సోమనాథం కళ్ళు చెమ్మగిల్లాయి.*

*"నేను దాచింది దొంగల పాలైంది, కాని నువ్వు దాచినది పదింతలై మనకు మంచి చేస్తోంది. ఒకప్పుడు సంపాదించడమే గొప్ప అనుకున్నాను. కానీ 'ఇతరులకు సహాయపడడం అంతకంటే గొప్ప' అని తెలియజేశావు నువ్వు. అసలైన సంపదంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు!"* అన్నాడు సోమనాథం, విప్పారిన ముఖంతో .

*భర్తలో వచ్చిన మార్పును చూసి సుగుణ ఎంతో ఆనందించింది.*

* దోచుకున్న సొమ్ముని దాచుకోకుండా తిరిగి ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెడితే  ఆ పెట్టుబడి ఎంతో కొంత మందికి జీవనాధారాన్ని చూపిస్తుంది. ఆ విధంగానైనా ఈ పాపానికి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం అయినా జరుగుతుంది. లేదంటే మీరు అక్రమంగా దాచుకున్న సొమ్ము పరులపాలు అయిపోతుంది. కనీసం వాటిని  మీ తరువాతి తరాలవారు కూడా అనుభవించే అవకాశం లేకుండా పోతుంది.*

*అందరం కష్టపడి సంపాదించుకుందాం వాటిని  సక్రమైన మార్గంలో  పెట్టుబడులు పెట్టి మన కుటుంబాన్ని, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకుందాం.*

*అంతేకానీ సంపాదించుకున్న సొమ్మును దాచుకుంటే ప్రయోజనం శూన్యం.*

*భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు మన జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే పోయే ప్రమాదం కూడా వుంది తస్మాత్ జాగ్రత్త, దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుందాం.*

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...