Wednesday 8 March 2023

బీబీ నాంచారమ్మ ఎవ్వరు ? - నాచియార్ (11-Mar-23, Enlightenment Story)

 బీబీ నాంచారమ్మ ఎవ్వరు ?

\|/ \|/ \|/ \|/ \|/ \|/ \|/ \|/\|/ \|/ \|/\|/ \|/ \|/

ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి "బీబీ నాంచారమ్మ" గురించి, చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితా? ఆమె దైవస్వరూపం ఎలాఅయ్యారు?...

బీబీ నాంచారమ్మ! "నాచియార్" అనే తమిళపదం నుంచి "నాంచారమ్మ" అన్న పేరు వచ్చింది. అంటే భక్తురాలు అని అర్థం. ఇక "బీబీ" అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిదికాదు. కనీసం 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచిఉంది...

బీబీ నాంచారమ్మ, 'మాలిక్ కాఫిర్' అనే సేనాని కుమార్తె. ఆమె అసలుపేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగామారి తానుకూడా ముస్లింమతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు.

తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనమొస్తుంది కదా అనుకున్నాడు.

అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తినకి బయలుదేరాడు. హస్తినకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటిమధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రినడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం,

పట్టువస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం. అలా తనకుతెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజూ గడుస్తున్నకొద్దీ దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో,

రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తినకి ప్రయాణమయ్యారు. రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలుచూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు.

అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరుదాటించారు.

సురతాని ఉదయాన్నే లేచిచూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తానుకూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. 

*మరొక కధ ఏమిటంటే* : ఆ విగ్రహం రంగనాథునిదికాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలోకూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమెకూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహంకూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె "ముసల్మాను స్త్రీ" అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూలేదు...

ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించేకాలంలో, అతను ఓసారి తిరుమలమీదకు దండయాత్రకు వచ్చాడట.

అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెల్సుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !!!

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...